కార్డిఫ్: స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వెటరన్ బ్యాటర్ జో రూట్ (133 బంతుల్లో 9 ఫోర్లతో 99 నాటౌట్) అద్భుత పోరాటంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. గురువారం జరిగిన ఈ పోరులో తొలుత భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 66), విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 8 ఫోర్లతో 65) అర ్ధశతకాలతో సత్తా చాటారు.
ఇంగ్లిష్ బౌలర్లలో ఆర్చర్ (3/47), అట్కిన్సన్ (3/50) తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బెన్ డకెట్ (0), జాకబ్ బెథెల్ (4)తో పాటు కెప్టెన్ హ్యారీ బ్రూక్ (16) నిరాశపరచడంతో ఆతిథ్య జట్టు ఓ దశలో 53/3తో నిలిచినా.. సామ్ కరన్ (26), బట్లర్ (17), విల్ జాక్స్ (30), అట్కిన్సన్ (23 నాటౌట్)తో కీలక భాగస్వామ్యాలు నిర్మించిన రూట్ జట్టును గెలిపించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే లార్డ్స్ స్టేడియంలో జరుగుతుంది.
కోహ్లీ, శ్రేయస్ ఆదుకోవడంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగల్గింది. గిల్ (31) వేగంగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. రోహిత్ (26) గత మ్యాచ్ మాదిరిగానే తడబడి మరోసారి నిరాశపరచగా కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ (1) కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో అయ్యర్తో కలిసి విరాట్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.
తనదైన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించిన కోహ్లీ.. కరన్ బౌలింగ్లో బౌండరీతో తన కెరీర్లో 78వ హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే ఆర్చర్ రెండో స్పెల్లో అదిల్ రషీద్కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. సుందర్ (2) సైతం విఫలమవగా ఆర్చర్ ఒకే ఓవర్లో అక్షర్ (1), దూబే (0)ను ఔట్ చేసి పర్యాటక జట్టును కోలుకోనీయకుండా చేశాడు. చివర్లో బుమ్రా (20 నాటౌట్) కీలక పరుగులు చేసినా.. అట్కిన్సన్ 44వ ఓవర్లో అయ్యర్తో పాటు ప్రసిద్ధ్నూ ఔట్ చేసి భారత ఇన్నింగ్స్కు తెరదించాడు.