న్యూఢిల్లీ: భారీ వర్షాల మధ్య సాగుతున్న వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ విజయాలు సాధించాయి. సోమవారం గువాహటి వేదికగా జరిగిన పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలుపొందగా.. తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్లు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారమే ముగియడం గమనార్హం. వర్షం కారణంగా మ్యాచ్ను 37 ఓవర్లకు కుదించగా.. బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మెహదీ హసన్ (74), తన్జిద్ (45) రాణించారు. ఛేదనలో స్పిన్ ఆల్రౌండర్ మోయిన్ అలీ (56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) దుమ్మురేపడంతో 197 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 24.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.