Ashes Series : యాషెస్ సిరీస్లో బాజ్బాల్(BazzBall) ఆటతో ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించాలనుకున్నఇంగ్లండ్ బొక్కాబోర్లాపడింది. తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు బెన్ స్టోక్స్(Ben Stokes) సేన సిద్ధమవుతోంది. లార్డ్స్(Lord’s) వేదికగా జూన్ 28న మొదలయ్యే రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అందుకని ఆతిథ్య జట్టు ఆసీస్పై కొత్త అస్త్రాన్ని ప్రయోగించనుంది.
గాయపడిన మోయిన్ అలీ(Moeen Ali)కి బ్యాకప్గా 18 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రెహన్ అహ్మద్(Rehan Ahmed)ను తీసుకుంది. మొదట లియామ్ డాసన్(Liam Dawson)ను తీసుకోవాలని అనుకున్నారు. చివరకు ఆల్రౌండర్ అయిన రెహన్ వైపే కోచ్ బ్రెండన్ మెక్ కల్లం(Brendon McCullum), కెప్టన్ స్టోక్స్ మొగ్గు చూపారు. ఈ యంగ్స్టర్ ఆరంగేట్రం మ్యాచ్లోనే పాకిస్థాన్పై 7 వికెట్లు తీశాడు. అంతేకాదు నిరుడు జరిగిన అండర్ -19 వరల్డ్ కప్లోనూ సత్తా చాటాడు.
మోయిన్ అలీ
యాషెస్ సిరీస్ కోసమని మోయిన్ అలీ టెస్టుల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఈ ఆల్రౌండర్ కుడి చేతికి గాయమైంది. దాంతో, అతను బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఒకవేళ రెండో టెస్టు ప్రారంభానికల్లా అతను కోలుకోకుంటే అతడి ప్లేస్లో రెహన్ను ఆడించే అవకాశం ఉంది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ సంచలన విజయం సాధించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(44 నాటౌట్), నాథన్ లియాన్(16 నాటౌట్) అసమాన పోరాటం చేశారు. వీళ్లు 9వ వికెట్కు 55 రన్స్ జోడించారు. దాంతో, ఐదు టెస్టుల సిరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
తొలి టెస్టులో కమిన్స్ గెలుపు సంబురం