నిడమనూరు, జూలై 22 : కాంగ్రెస్ పాలనలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గొంతు తడుపుకునేందుకు గుక్కె డు నీరు కూడా కరువైందని సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. నిడమనూరు సాం ఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గత పది రోజులుగా విద్యార్థినులు తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని ఆయన బుధవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులు బకెట్లలో నీటిని మూడో అంతస్తుకు మోసుకెళ్తున్న తీరును చూసి ఆవేదన చెందారు. సమస్యను వివరించేందుకు జిల్లా కలెక్టర్కు ఫోన్ చేయగా స్పందించలేదు.
ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ నిరుపేద బాలికలు విద్యనభ్యసిస్తున్న గురుకులాల్లో పది రోజులుగా తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నా సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారులకు ఉపాధ్యాయులు పరిస్థితిని వివరించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించి తాగు నీటి సమస్యను పరిష్కరించి విద్యార్థినుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు లకుమాల మధుబాబు, పిల్లి అభినయ్ యాదవ్, రాయినబోయిన రామలింగయ్య, లక్ష్మణ్, మహ్మద్ తౌసిఫ్ తదితరులు ఉన్నారు.