హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): జైలు గోడల నడుమ బందీ అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ..’ అంటూ గర్జించిన తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ సమరయోధుడు దాశరథి అని, ఆ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు కొనసాగించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు నిచ్చారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన కలాన్ని, గళాన్ని శక్తివంతంగా వినిపించి నిజాం నిరంకుశ పాలనకు సింహస్వప్నంగా నిలిచిన ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా కేసీఆర్ బుధవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాలకు దాశరథి అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికలపై నిలబెట్టడంలో ఆయన చేసిన సాహితీ పోరాటం చరిత్రాత్మకమని పేర్కొన్నారు.
కృష్ణమాచార్యుల త్యాగాలు, తెలంగాణ అస్తిత్వం కోసం చేసిన సాహితీ సేవలను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారిక ఉత్సవంగా నిర్వహించిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఆయన పేరు మీద ప్రత్యేకంగా దాశరథి సాహితీ పురసారాన్ని నెలకొల్పి ప్రతిఏటా ప్రముఖ సాహితీవేత్తలను ఘనంగా సతరించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడిన నేపథ్యంలో, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి దాశరథి కృష్ణమాచార్యులు అందించిన పోరాట స్ఫూర్తి తెలంగాణ సమాజానికి ఎంతో అవసరమని స్పష్టంచేశారు. అణచివేతను ఎదిరించే అక్షర యుద్ధంలో దాశరథి రచనలు ఎప్పటికీ నిత్యస్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.