ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అంతకుముందు హార్దిక్ పాండ్యా, సిరాజ్ బంతితో చెలరేగడంతో ఇంగ్లండ్ను 259 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్కు లక్ష్యఛేదనలో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాప్లే బౌలింగ్లో ధవన్ (1) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరాడు.
ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ చక్కదిద్దుతారని భావించిన రోహిత్ (17) విఫలమయ్యాడు. కోహ్లీ (17) కూడా తనకు దక్కిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ (16) కూడా విఫలమయ్యాడు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా (71), రిషభ్ పంత్ (125 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు.
అయితే హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత గేరు మార్చే క్రమంలో హార్దిక్ అవుటయ్యాడు. ఆ తర్వాత జడేజా (7 నాటౌట్) అండగా సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. 42వ ఓవర్లో వరుసగా ఐదు ఫోర్లు బాదాడు. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికే రివర్స్ స్వీప్తో మరో ఫోర్ బాది లాంఛనం పూర్తిచేశాడు. దీంతో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ విజయంతో వన్డే సిరీస్ కూడా 2-1 తేడాతో భారత్ వశమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే మూడు వికెట్లతో సత్తా చాటగా.. ఓవర్టాన్, బ్రైడన్ కార్సే చెరో వికెట్ తీసుకున్నారు.