ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో టెయిలెండర్లను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు జానీ బెయిర్స్టో (106), శామ్ బిల్లింగ్స్ (36) కాసేపు నిలకడగా ఆడి ఆ జట్టుకు భారీ స్కోరు అందించేలా కనిపించారు. అయితే షమీ బౌలింగ్లో బెయిర్స్టో అవుటైన తర్వాత ఆ జట్టు కోలుకోలేదు.
సిరాజ్ కూడా విజృంభించడంతో ఆ జట్టు బ్యాటర్లు విలవిల్లాడారు. సిరాజ్ బౌలింగ్లో స్టువర్ట్ బ్రాడ్ (1), శామ్ బిల్లింగ్స్ (36), మాథ్యూ పాట్స్ (19)ని పెవిలియన్ చేర్చాడు. 62వ ఓవర్లో సిరాజ్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్, సిక్స్ బాదిన పాట్స్.. ఆ తర్వాతి వేసిన ఇన్స్వింగర్ను ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్స్లో ఉన్న శ్రేయాస్ వైపు వెళ్లింది. అతను క్యాచ్ పట్టానని చెప్పినా పాట్స్ మైదానం వీడలేదు. మైదానంలోని అంపైర్ తన నిర్ణయం అవుట్ అని చెప్తూ.. నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు పంపించారు. అయ్యర్ చేతుల్లో చేరడానికి ముందే బంతి నేలపై బౌన్స్ అయినట్లు రిప్లేలో కనిపించింది.
కానీ అది నేలపై పడిందా? లేక అయ్యర్ వేళ్లపై బౌన్స్ అయిందా అనేది స్పష్టంగా తెలియలేదు. దాంతో పాట్స్ను అవుట్గా అంపైర్ ప్రకటించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు ఇంకా 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ రోజు, రేపు భారత బ్యాటర్లు ధాటిగా ఆడితే ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం ఉంచే అవకాశం ఉంది.