ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టును పటిష్ట స్థితిలో నిలపడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, అభిమానులంతా ‘మిస్టర్ 360’ అని పిలుచుకునే ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. టెస్ట్ క్రికెట్ లో తాను చూసిన బెస్ట్ ఇదేనని ఏబీడీ కొనియాడాడు. ఇంగ్లండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నప్పుడు ఈ ఇద్దరూ కీలక భాగస్వామ్యంతో ఎదురుదాడికి దిగారని పేర్కొన్నాడు.
ట్విటర్ వేదికగా డివిలియర్స్ స్పందిస్తూ.. ‘గత కొన్నిరోజులుగా ఇంట్లో లేనందువల్ల చాలా క్రికెట్ మిస్ అయ్యాను. కానీ ఇప్పుడే ఎడ్జ్బాస్టన్ టెస్టు హైలైట్స్ చూశాను. ఈ మ్యాచ్ లో రిషభ్ పంత్-రవీంద్ర జడేజా ల ఎదురుదాడి అద్భుతం. టెస్ట్ క్రికెట్ లో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే..’అని పేర్కొన్నాడు.
కాగా ఈ టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా తొలుత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా.. 98 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) లు ఆరో వికెట్ కు 222 పరుగులు జోడించారు. వీళ్లిద్దరి ఆటతో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 416 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇక ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 284 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. పుజారా (50 నాటౌట్), పంత్ (30 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.
Haven’t been home and missed most of the Cricket action. Finished watching the highlights now. That counterattack partnership from @RishabhPant17 and @imjadeja is right up there with the best I’ve ever seen in Test Cricket!
— AB de Villiers (@ABdeVilliers17) July 4, 2022