ముంబై: వచ్చే టీ20 ప్రపంచకప్ ముగియగానే తన కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా తదుపరి కోచ్ ఎవరనే అంశంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. కుంబ్లే తదితరుల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. తాజాగా రాహుల్ ద్రవిడ్కు ఈ పదవి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని వార్తలొచ్చాయి. అయితే బీసీసీఐ ఆఫర్ను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ద్రవిడ్ భుజాలకెత్తుకొని ఉన్నాడు. దీంతోపాటు అండర్-19 భారత జట్టు, ఇండియా ఎ జట్లకు కోచ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తప్పుకోగానే కోచ్ పదవిని ద్రవిడ్కు అప్పగించాలని బీసీసీఐ భావించింది. కానీ ద్రవిడ్ మాత్రం దీనికి సుముఖంగా లేనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగియగానే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ కూడా ప్రకటించాడు.
అలాగే కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రవిశాస్త్రి కూడా వెల్లడించాడు. రవిశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటారని సమాచారం. జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ కూడా ఈ మెగా టోర్నీ తర్వాత జట్టును వీడనున్నాడు.