గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ టోర్నీలో భారత జట్టు అనుకున్న ఫలితం సాధించలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎంపికవలేదు. అసలు వాళ్లను సెలెక్టర్లు కనీసం పట్టించుకోవడం లేదు.
ఇదే విషయాన్ని గుర్తు చేసిన మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. టీమిండియా మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ను కూడా అలాగే నిర్లక్ష్యం చేస్తారేమో అని సంజయ్ బంగర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘‘నాకు తెలిసి టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో ఉమ్రాన్ ఉంటాడు. వెస్టిండీస్తో టీ20 సిరీస్ నాటికి కనీసం అతను ఐదు మ్యాచులైనా ఆడతాడని అనుకుంటున్నా’’ అని బంగర్ చెప్పాడు.
అదే సమయంలో టీ20 ప్రపంచకప్లో ఫలితం భారత్కు అనుకూలంగా రాకపోతే అతన్ని కూడా పట్టించుకోకుండా వదిలేసే ప్రమాదం ఉందన్న అతను.. అలాంటి పని చేయొద్దని సెలెక్టర్లకు సూచించాడు. కేవలం ఫలితం రాలేదనే కారణంతో అంతటి ట్యాలెంట్ ఉన్న ఆటగాడిని నిర్లక్ష్యం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. మరి సెలెక్టర్లు ఏం చేస్తారో? ఉమ్రాన్ ఎప్పుడు భారత్ తరఫున అరంగేట్రం చేస్తాడో చూడాలి మరి.