ముంబై: ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల మధ్య జరుగుతున్న చర్చలు రెండు విషయాల గురించే. ఒకటి టీ20 ప్రపంచకప్, రెండోది ఈ టోర్నీ తర్వాత జట్టులో జరిగే మార్పులు. ఈ ప్రపంచకప్ తర్వాత జట్టు కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా తదుపరి కోచ్ ఎవరనే విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, రికీ పాంటింగ్, మహేల జయవర్దనే తదితరుల పేర్లు ఈ పదవి కోసం వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా ఆదివారం నాడు టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. దానిలో కోచ్ పదవికి దరఖాస్తు చేసే వారికి ఉండాల్సిన అర్హతలను కూడా పేర్కొంది.
ఈ ప్రకటన ప్రకారం టీమిండియా కోచ్ అవ్వాలనుకునే వ్యక్తి వయసు 60 ఏళ్లకు మించకూడదు. అలాగే సదరు అభ్యర్థి కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డే మ్యాచులు ఆడిన అనుభవం కలిగి ఉండాలి. లేదంటే ఏదైనా టెస్టు క్రికెట్ ఆడే దేశపు జట్టుకు రెండేళ్లపాటు కోచ్గా పనిచేసి ఉండాలి.
అంతేకాదు ఐసీసీ అసోసియేట్ సభ్య దేశం లేదా ఐపీఎల్ జట్టు లేదా డొమెస్టిక్ జట్టుకు మూడేళ్ల పాటు కోచ్గా బాధ్యతలు నిర్వర్తించిన వారు కూడా టీమిండియా కోచ్ పదవికి అర్హులే. లేదంటే బీసీసీఐ అందించే లెవెల్ 3 లేక దానితో సమానమైన ధ్రువీకరణ ఉన్న వారు కూడా టీమిండియా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.