IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కీలక మ్యాచ్కు సిద్ధమైంది. ఫ్లే ఆఫ్స్ ఆఖరి బెర్తు కోసం సీఎస్కే శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో అమీతుమీ తేల్చుకుంది. క్రికెట్ దిగ్గజాలు ఎంస్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ(Virat Kohli)లు తలపడుతున్న ఈ మ్యాచ్పై అందరి కళ్లు నిలిచాయి. అయితే.. బెంగళూరు అంటే చాలు పూనకం వచ్చినట్టు చెలరేగే ధోనీ ఈసారి ఏం చేస్తాడు? అనేది చూడాలి.
ఇప్పటివరకూ చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీతో ధోనీ 11 మ్యాచ్లు ఆడాడు. ఫినిషర్గా పేరొందిన మహీ భాయ్ 174.26 స్ట్రయిక్ రేటుతో ఏకంగా 413 రన్స్ బాదేశాడు. అతడి విధ్వంసంక ఇన్నింగ్స్లో 29 ఫోర్లు, 30 సిక్సర్లు ఉండడం విశేషం. కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడుతున్న ధోనీ.. ఈసారి తనమార్క్ షాట్లతో ఫ్యాన్స్ను అలరిస్తాడా? లేదా? అనేది మరికొన్ని నిమిషాల్లో తెలిసిపోనుంది. వరుణుడి ముప్పు పొంచి ఉన్న చిన్నస్వామి స్టేడియంలో నాకౌట్ పంచ్ ఎవరిది? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పదిహేడో సీజన్ ఆరంభంలో అదరగొట్టిన సీఎస్కే ఆ తర్వాత పరాజయాలతో వెనకబడినా.. మళ్లీ విజయాలతో ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. మరోవైపు ఆర్సీబీ కథ కూడా దాదాపు అలాంటిదే. వరుస ఓటములతో ఎలిమినేట్ అవుతుందనుకున్న ఆ జట్టు 5 విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ పోటీలోకి వచ్చింది. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 14 పాయింట్లు, బెంగళూరుకు 12 పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో సీఎస్కే గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది.
ఒకవేళ ఆర్సీబీ అడుగు ముందుకేయాలంటే 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అదీ కాదంటే.. 200పైగా లక్ష్యాన్ని 18.1 ఓవర్లో చేధించాలి. అప్పడే సీఎస్కే రన్రేటును దాటేసి ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. అయితే.. మ్యాచ్కు వర్ష సూచన ఉండడం ఆర్సీబీ జట్టుతో పాటు ఫ్యాన్స్ను కలవరపెడుతోంది. ఒకవేళ వాన పడి మ్యాచ్ రద్దయితే 15 పాయింట్లతో చెన్నై దర్జాగా నాకౌట్ పోరుకు దూసుకెళ్తుంది. డూప్లెసిస్ బృందం ఇంటిదారి పడుతుంది.