చెన్నై: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని తమిళనాడులోని ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలోని 137 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. శనివారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరింది. అయితే సాంకేతిక లోపం వల్ల ఆ విమానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లికి మళ్లించారు. అక్కడి ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. అందులో ఉన్న 137 మంది ప్రయాణికులను మరో విమానంలో బెంగళూరు చేర్చే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేశారు.
కాగా, శుక్రవారం కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలోని పవర్ యూనిట్లో అగ్ని ప్రమాదం హెచ్చరిక వెలువడింది. దీంతో ఆ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. 175 మంది ప్రయాణికులున్న ఆ విమానాన్ని ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.