Virat Kohli : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ఓ రేంజ్లో చెలరేగుతున్నాడు. ఒక సెంచరీతో పాటు ఐదు అర్ద శతకాలు బాదిన విరాట్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)ను ప్లే ఆఫ్స్ పోటీలో నిలిపాడు. అయినా సరే అతడి స్ట్రయిక్ రేటుపై, అతడిని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవడంపై మైదానంలోపలా, బయటా అనవసర చర్చ నడుస్తూనే ఉంది. అయితే.. పనిగట్టుకొని తనపై మాటలు తూలేవాళ్లకు కోహ్లీ తన ఆటతోనే జవాబిస్తున్నాడు.
శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో కీలక పోరుకు ముందు విరాట్ మాట్లాడాడు. తన గురించి నానా చెత్త వాగే వాళ్ల గురించి కోహ్లీ కాస్త ఘాటుగానే స్పందించాడు. తాను ఎలాంటి ఆటగాడినో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. అంతేకాదు తన సుదీర్ఘ కెరీర్లో గుండెను పిండేసిన సందర్భాలు రెండు ఉన్నాయని చెప్పాడు. ఒకటి 2016లో ఐపీఎల్ ట్రోఫీని చేజార్చుకోవడం.. అదే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడం తనను ఎంతో బాధించాయని విరాట్ వెల్లడించాడు.
‘నేను మైదానంలో ఏం చేస్తానో నాకు తెలుసు. నేను ఎలాంటి ఆటగాడినో ఏ ఒక్కరికి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు మ్యాచ్లు ఎలా గెలవాలి? అని నేను ఇప్పటివరకూ ఎవర్నీ అడగలేదు. అయితే.. నేను చాలా మ్యాచ్లు గెలవలేకపోయాను’ అని కోహ్లీ తెలిపాడు. దాంతో, అతడిని బాహాటంగా విమర్మించే సునీల్ గవాస్కర్, గౌతం గంభీర్ లాంటి మాజీలకు విరాట్ బాగా బుద్ది చెప్పాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
కోహ్లీ, సునీల్ గవాస్కర్
పదిహేడో సీజన్ ఆరంభంలో అట్టడుగున నిలిచిన ఆర్సీబీ అనూహ్యంగా ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ మెరపులకు.. బౌలింగ్ యూనిట్ తోడవ్వడంతో వరుసగా ఐదు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. శనివారం సొంతమైదానంలో ఆర్సీబీకి అగ్ని పరీక్ష ఎదురవ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చాన్స్ మెరుగుపరుచుకుంటుంది.
అయితే.. ఆర్సీబీ 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అదీ కాదంటే.. 200పైగా లక్ష్యాన్ని 18.1 ఓవర్లో చేధించాలి. అప్పడే సీఎస్కే రన్రేటును దాటేసి ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. అయితే.. అది అనుకున్నంత సులువు కాదు. పైగా మ్యాచ్కు వర్ష సూచన ఉంది. ఒకవేళ వాన పడి మ్యాచ్ రద్దయితే 15 పాయింట్లతో చెన్నై దర్జాగా నాకౌట్ పోరుకు దూసుకెళ్తుంది.