టీమిండియాలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. గాయం కారణంగా జట్టుకు దూరమైన అతను.. ఇటీవల కరోనా సోకడంతో మరికొంత కాలం ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో న్యూజిల్యాండ్ మాజీ దిగ్గజం స్కాట్ స్టైరిస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
రాహుల్ ఆటకు దూరమవడంతో చాలా మంది ప్లేయర్లకు సువర్ణావకాశం లభించిందని, వాళ్లు ఆ అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నారని చెప్పాడు. రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కూడా ఓపెనింగ్ బాధ్యతలను చక్కగా నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
‘‘భారత బృందంలో చాలా మంచి వాతావరణం ఉంటుందని నాకు తెలుసు. కానీ ఒక ఆటగాడిగా నేనైనా సరే.. నా స్థానం తీసుకునే అవకాశం మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడను’’ అని చెప్పాడు. ప్రస్తుతం గాయంతో ఆటకు దూరమైన రాహుల్.. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఫామ్లో ఉంటాడా? అనేది కూడా ప్రశ్నేనని స్టైరిస్ అన్నాడు.
అలాగే అతని గైర్హాజరీలో పంత్, సూర్యకుమార్ వంటి ఆటగాళ్లను చూసిన సెలెక్టర్లు ‘‘అసలు రాహుల్ అవసరం ఉందా?’’ అని కూడా ఆలోచించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. విండీస్ పర్యటనకు ఎంపికైనప్పటికీ.. కరోనా పాజిటివ్ రావడంతో రాహుల్ ఈ సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. జింబాబ్వే పర్యటనలో కూడా సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు. రాహుల్ కూడా కోహ్లీలాగే ఆసియా కప్ నుంచి జట్టుతో కలిసే అవకాశం ఉంది.