ODI World Cup 2023 : సొంతగడ్డపై పుష్కర కాలం తర్వాత జరుగుతున్న వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వేదిక ఏదైనా దూకుడే మంత్రగా ప్రత్యర్థులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. కోహ్లీ, రోహిత్ బ్యాటింగ్ విన్యాసాలు.. షమీ, బుమ్రా, సిరాజ్ మ్యాజిక్ను కళ్లారా చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. టికెట్లు దొరకనివాళ్లు టీవీలు, ఓటీటీ ఫ్లాట్ఫామ్స్కు అతుక్కుపోతున్నారు.
ఆదివారం ‘బర్త్ డే బాయ్’ విరాట్ కోహ్లీ 49వ వన్డే శతకంతో ఈడెన్ గార్డెన్స్ మోతమోగిపోగా.. జడేజా 5 వికెట్లతో సఫారీలను చుట్టేసిన ఈ మ్యాచ్ను డిస్నీ ప్లస్ హాట్స్టార్(Disney Plus Hotstar)లో 44 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటే.. 4.4 కోట్ల మంది వీక్షించారు. దాంతో, 4.3 కోట్ల వ్యూస్ రికార్డు బద్దలైంది. పైగా జియో సినిమాతో పోటీ తట్టుకొని మరీ ఇన్ని వ్యూస్ సాధించడం విశేషం. అక్టోబర్ 14 అహ్మాదాబాద్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ను 3.5 కోట్ల మంది చూశారు.
విరాట్ కోహ్లీ(101 నాటౌట్)
ఆదివారం 35వ వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లీ దక్షిణాఫ్రికాపై తడాఖా చూపించాడు. అద్భుత సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించిన విరాట్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఉన్న 49 శతకాల రికార్డు సమం చేశాడు. 372 పరుగుల ఛేదనలో తెంబా బవుమా బృందాన్ని షమీ, సిరాజ్ వణికించారు. ఆ తర్వాత బంతి అందుకున్న జడేజా 5 వికెట్లు తీయడంఓ 83 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌటయ్యింది. భారత జట్టు 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందగా.. వన్డే చరిత్రలో సఫారీలు భారీ ఓటమి మూటగట్టుకున్నారు.