కివీస్తో జరిగిన తొలి టెస్టులో భారత బ్యాటింగ్ విభాగం తనను పూర్తిగా నిరాశపరిచిందని మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ చెప్పాడు. ముఖ్యంగా భారత బ్యాటింగ్ ఆర్డర్లో టాప్-4 బ్యాటర్లు చెత్తగా ఆడారన్నాడు. ఈ విషయంపై కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ రాథోర్ దృష్టిపెడతారని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.
శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభమయ్యే ముందే ఈ సమస్యపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. తొలిటెస్టులో మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, పుజారా, రహానే.. టాప్ 4 ఆటగాళ్లుగా ఉన్నారు. ఈ టెస్టులో వీరి యావరేజ్ 21.5గా ఉంది. ఈ విషయాన్నే ఎత్తిచూపిన లక్ష్మణ్.. 2010 తర్వాత భారత టాప్-4 ఇంత చెత్తగా ఆడటం ఇది రెండోసారని గుర్తుచేశాడు.
‘రెండో ఇన్నింగ్స్లో పుజారా అవుటైన విధానం చూస్తేనే అతని బ్యాటింగ్లో టెక్నికల్ లోపాలున్నాయని తెలిసిపోతోంది. చాలా గ్యాప్ తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న మాట నిజమే.. కానీ ప్రొఫెషనల్ ఆటగాడిగా మన పొరపాట్లు గుర్తించి సరిదిద్దుకోవాలి. ఇక్కడ దురదృష్టమేంటంటే.. ఈ పొరపాట్లలో చాలా వరకు సాంకేతిక లోపాలే. ఈ విషయంపై రాహుల్, రాథోర్ ఇద్దరూ కచ్చితంగా దృష్టి పెడతారని నాకు తెలుసు’ అని లక్ష్మణ్ తెలిపాడు.
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో కూడా భారత్ను ఆదుకుంది అరంగేట్ర ఆటగాడు శ్రేయాస్ అయ్యరే. రెండో ఇన్నింగ్స్లో అతనికి వెటరన్ వృద్ధిమాన్ సాహా (61 నాటౌట్) సహకారం అందించాడు.