టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్లో రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచుల్లోనూ ఆడిన రోహిత్ ఇంత తక్కువ స్కోరు చేయడం ఇది రెండోసారి. లంకతో జరిగిన మూడో మ్యాచ్లో రోహిత్ ఆటతీరు చాలా అసహజంగా ఉందని సన్నీ అభిప్రాయపడ్డాడు.
తొలి బంతికే ముందుకొచ్చి బౌండరీ బాదిన రోహిత్.. ఆ తర్వాతి బంతికే మరో లాఫ్ట్ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి.. లంక కెప్టెన్ షానక ముందు పడటంతో బతికిపోయాడు. ఆ వెంటనే పుల్షాట్ ఆడటానికి ప్రయత్నించి అవుటయ్యాడు. ఇలా ప్రతి బంతికీ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించడం రోహిత్ ఆటతీరు కాదని లిటిల్ మాస్టర్ అన్నాడు. ఈ ఆటతీరుతో రోహిత్ కూడా అసంతృప్తి చెంది ఉంటాడన్నాడు.
వచ్చే మూడు, నాలుగు రోజుల్లో జరిగే టెస్టు సిరీస్ నాటికి ఆలోచనా విధానం మార్చుకొని, తన పద్ధతిలో రోహిత్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని గవాస్కర్ సలహా ఇచ్చాడు. మార్చి 4న మొహాలీలో లంకతో భారత జట్టు తొలి టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఇది విరాట్ కోహ్లీ కెరీర్లో 100వ టెస్టు మ్యాచ్. అలాగే, పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్గా రోహిత్కు ఇది తొలి మ్యాచ్.