మణికొండ : అనుమానం ఓ నిండు ప్రాణా న్ని బలిగొంది. వారికి వివాహమై పదహారేండ్లు అయ్యింది. అన్యోన్యంగా సాగుతున్న సంసారంలో అనుమానాలు అలముకున్నాయి. ఇద్దరూ విడిపోగా.. స్థానిక పంచాయతీ పెద్దలు మరోసారి వారిని కలిపారు. అయినా అనుమానం పెనుబూతంగా మారి.. భర్త చేతిలో భార్య హతమైన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా ఉడుమేశ్వర్ గ్రామానికి చెందిన బస్వప్ప, పద్మావతిలకు పదహారేండ్ల కిందట వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి సంసార జీవనం సాఫీగా సాగుతుండగా బస్వప్ప తాగుడుకు బానిసై భార్యను అనుమానంతో వేధించసాగాడు.
. వారి స్వగ్రామంలో పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగాయి. ఎంత చెప్పినా భర్తలో మార్పు కన్పించకపోవడంతో పద్మావతి(40) కొన్నాళ్లుగా ఒంటరి జీవనం సాగిస్తూ ఓ ప్రైవేటు దవాఖానలో ఆయాగా పనిచేసుకుంటుంది. వీరికి సంతానం కలుగలేదు. కాగా ఇటీవల సొంతూరిలో పెద్దల సమక్షంలో మరోసారి పంచాయతీ పెట్టి ఇరువురిని కలిపారు. ఇద్దరూ కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బండ్లగూడ మున్సిపాలిటీ హైదర్షాకోట్ యాదవ్ భవన్ వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. పద్మావతి ప్రైవేటు దవాఖానలో ఆయాగా పనిలో చేరింది. భర్త బస్వప్ప చిన్నచిన్న పనులు చేసుకుంటూ మద్యానికి బానిసయ్యాడు. ఎన్నిసార్లు చెప్పినా అతడిలో మార్పురాకపోగా బుధవారం రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్య పద్మావతితో గొడవపడి ఆమె తలను భూమికేసి బాదాడు.
దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం బయటకు పొక్కనీయకుండా రాత్రి ఇంట్లోనే నిద్రపోయిన బస్వప్ప గురువారం తెల్లవారుజామున ఇంటికి తాళంవేసి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా చుట్టుపక్కల వారు ఎక్కడికెళ్తున్నావంటూ ప్రశ్నించాగా.. తడబడుతూ మాట్లాడ సాగాడు. అనుమానం వచ్చిన వారు పద్మావతి ఎక్కడికి వెళ్లిందంటూ ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో స్థానికులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు చేరుకుని ఇంటి తాళాలు పగులగొట్టి చూడగా రక్తపు మడుగులో పద్మావతి పడి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. బస్వప్పను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ మదనం గంగాధర్, ఎస్సై అన్వేశ్రెడ్డి తెలిపారు.