రాంచీ: దేశంలోని వివిధ రాష్ర్టాల్లో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా నెలకొంది. ఒకవైపు ఎండలు రోజురోజుకు ఎక్కువవుతుండటం, మరోవైపు బొగ్గు నిల్వలు అంతకంతకు తగ్గిపోవడం విద్యుత్ ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నది. జార్ఖండ్ రాష్ట్రంలో కరెంట్ కోతలు అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గంటల కొద్ది కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి ట్విట్టర్లో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
‘జార్ఖండ్ రాష్ట్ర వాసిగా, పన్ను చెల్లించే పౌరురాలిగా ప్రశ్నిస్తున్నా. గత కొన్నేండ్లుగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎందుకు నెలకొంది. కరెంట్ పొదుపుగా వినియోగిస్తున్నా..ఇలా ఎందుకు జరుగుతున్నది’ అంటూ సాక్షి ట్వీట్ చేసింది. దీనికి కొద్ది గంటల్లోనే వేలల్లో లైక్లు, రీట్వీట్లు వచ్చాయి. సాక్షికి మద్దతుగా చాలా మంది ట్వీట్లు చేయగా, మరోవైపు రాజధాని రాంచీలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా నగరాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ మరికొందరు విమర్శలకు దిగారు.