హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుస్సేన్సాగర్ వేదికగా ఆదివారం ముగిసిన మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్షిప్లో తెలంగాణ యువ సెయిలర్లు లావేటి ధరని, వడ్ల మల్లేశ్, కొమురవెల్లి దీక్షిత పసిడి పతకాలతో మెరిశారు. అండర్-19 ఇంటర్నేషనల్ క్లాస్ మిక్స్డ్ విభాగంలో ధరణి, మల్లేశ్ జోడీ 17 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి జాతీయ చాంపియన్షిప్ కైవసం చేసుకుంది.
నాన్సిరాయ్-అనిరాజ్, విద్యాన్షి, మనీశ్ జోడీలు వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. బాలికల అండర్-15 అప్టిమిస్టిక్ విభాగంలో దీక్షిత 12 రేసుల తర్వాత 57 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకుంది. షగున్ ఝా(మధ్యప్రదేశ్), ఆర్తివర్మ(మహరాష్ట్ర) రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. బాలుర విభాగంలో ఏకలవ్య విజేతగా నిలిచాడు. మొత్తంగా ఈ టోర్నీలో తెలంగాణ సెయిలర్లు ఏడు స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు దక్కించుకున్నారు.