Joe Root: భారత పర్యటనలో ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ ఆడిన నాలుగు ఇన్నింగ్స్లలోనూ విఫలమయ్యాడు. హైదరాబాద్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 29 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్లో 2 రన్స్ చేశాడు. ఇక వైజాగ్ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 రన్స్కే పరిమితమైన రూట్.. రెండో ఇన్నింగ్స్లో 16 పరుగులకు ఔటయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి 52 పరుగులే చేసినా రూట్ మాత్రం ఈ రెండు టెస్టులలో పలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు.
హైదరాబాద్ టెస్టులో 31 పరుగులు చేయడంతో రూట్.. భారత్పై టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసిన విషయం విదితమే. పాంటింగ్.. 2,555 పరుగులు చేయగా రూట్ 2,557 రన్స్తో అగ్రస్థానానికి ఎగబాకాడు. తాజాగా వైజాగ్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో 16 పరుగులు చేయడం ద్వారా రూట్.. భారత్లో పర్యాటక జట్టు తరఫున వెయ్యి పరుగులు చేసిన ఐదో బ్యాటర్గా నిలిచాడు. వైజాగ్ టెస్టుతో రూట్.. భారత్పై 1,004 రన్స్కు చేరాడు.
ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ 1,359 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్ (1,235), గోర్డాన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్ – 1,042), మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా 1,027) లు రూట్ కంటే ముందున్నారు. 2012 లో భారత పర్యటనలో భాగంగా అలెస్టర్ కుక్ ఈ రికార్డు సాధించాడు.