న్యూఢిల్లీ: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. మిచెల్ స్టార్క్ (4/40) అద్భుత బౌలింగ్కు తోడు కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 56), అభిషేక్ పోరెల్ (31 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 51) సత్తా చాటడంతో సొంతగడ్డపై ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. రాజస్థాన్ ఇచ్చిన 194 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్లు రాహుల్, పోరెల్ తొలి వికెట్కు 61 బంతుల్లోనే 105 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. కానీ, సాహిల్ పరాఖ్ (9), ట్రిస్టన్ స్టబ్స్ (4), డేవిడ్ మిల్లర్ (9)ను వెంటవెంటనే ఔట్ చేసిన రాయల్స్ బౌలర్లు ఉత్కంఠ రేపినా.. చివర్లో కెప్టెన్ అక్షర్ పటేల్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (5 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 18 నాటౌట్) జట్టును గెలిపించారు.
తొలుత రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. జైస్వాల్ (12) నిరాశ పరిచినా.. ధ్రువ్ జురెల్ (40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), కెప్టెన్ రియాన్ పరాగ్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51), వైభవ్ సూర్యవంశీ (21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దాంతో రాయల్స్ ఓ దశలో 14 ఓవర్లకు 160/2తో నిలిచి 230పైచిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ, 15వ ఓవర్లో పరాగ్తో పాటు డొనోవన్ ఫెరీరా (0), రవి సింగ్ (4)ను ఔట్ చేసిన స్టార్క్ రాజస్థాన్ నడ్డి విరిచాడు. శుభమ్ దూబే (5)ను మాధవ్ తివారీ పెవిలియన్ చేర్చడంతో తీవ్ర ఒత్తిడిలో పడింది. దసున్ షనక (10) నిరాశపరిచాడు. మొత్తంగా 33 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయి లయ తప్పింది. స్టార్క్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
43 ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ కొట్టిన సిక్సర్లు. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా అభిషేక్ శర్మ (2025లో42 ) రికార్డు బ్రేక్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు : రాజస్థాన్: 20 ఓవర్లలో 193/8 (జురెల్ 53, పరాగ్ 51, స్టార్క్ 4/40);
ఢిల్లీ : 19.2 ఓవర్లలో 197/5 (రాహుల్ 56, పోరెల్ 51, ఆర్చర్ 2/35)
