అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే సూపర్-8 బెర్తు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన తమ ఆఖరి లీగ్ పోరులో అదరగొట్టింది. బుధవారం మొతెరా స్టేడియంలో జరిగిన గ్రూపు-ఏ మ్యాచ్లో టీమ్ఇండియా 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ వరుస విజయాల రికార్డును 12కు పెంచుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా..శివమ్ దూబే(31 బంతుల్లో 66, 4ఫోర్లు, 6సిక్స్లు) ధనాధన్ అర్ధసెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 193/6 స్కోరు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు అభిషేక్శర్మ(0) మరోమారు విఫలమైన వేళ మిడిల్లో దూబేతో పాటు హార్దిక్పాండ్యా(21 బంతుల్లో 30, 3 సిక్స్లు) రాణించడంతో భారత్ పోరాడే స్కోరు అందుకుంది. వాన్బీక్(3/56), ఆర్యన్ దత్(2/19) రాణించారు. లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ అద్భుత పోరాటపటిమ కనబరిచింది.
టీమ్ఇండియా బౌలింగ్ దాడిని సమర్థంగా నిలువరిస్తూ 194 పరుగుల ఛేదనలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. బాస్ డీ లిడె(33), లియాన్ కాచెట్(26) తుదికంటా పోరాడారు. వరుణ్ చక్రవర్తి(3/14) మూడు వికెట్లు తీయగా, బ్యాట్తో అదరగొట్టిన దూబే (2/35) బంతితోనూ ఆకట్టుకున్నాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన దూబేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈనెల 21 నుంచి సూపర్-8 పోరు మొదలుకానుంది. తమ తొలి పోరులో 22న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.
టీమ్ఇండియా మరోమారు స్పిన్ బౌలింగ్లో ఘోరంగా తడబడింది. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు. మెగాటోర్నీ ముందు వరకు ప్రత్యర్థులకు దడపుట్టేలా బ్యాటింగ్ చేసిన అభిషేక్శర్మ ముచ్చటగా మూడోసారి సున్నా చుట్టాడు. భారత సంతతి స్పిన్నర్ ఆర్యన్ దత్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భారీ షాట్ ఆడబోయిన అభిషేక్ పరుగుల ఖాతా తెరువకుండానే నిరాశగా వెనుదిరిగాడు.
దీంతో స్కోరుబోర్డుపై పరుగులు చేరకముందే టీమ్ఇండియా..అభిషేక్ వికెట్ కోల్పోయింది. ఈ తరుణంలో ఇన్ఫామ్ బ్యాటర్ ఇషాన్ కిషన్(18), హైదరాబాదీ తిలక్వర్మ(31) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. వాన్ బీక్ బౌలింగ్లో స్ట్రయిట్ సిక్స్తో తిలక్ తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. మరో ఎండ్లో ఇషాన్ కూడా చెలరేగడంతో పరుగుల రాక మొదలైంది. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో బంతిపై నియంత్రణ కోల్పోయిన ఇషాన్ బ్యాట్తో వికెట్లను గిరాటేశాడు.
దీంతో పవర్ప్లే ముగిసే సరికి టీమ్ఇండియా 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. తిలక్కు కెప్టెన్ సూర్యకుమార్ జత కలిశాడు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. బౌలింగ్ మార్పుగా వచ్చిన వాన్బీక్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయిన తిలక్..బౌండరీ వద్ద వాండర్ మెర్వ్ సూపర్ క్యాచ్తో మూడో వెనుదిరుగడంతో 30 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
ఆ తర్వాత వచ్చిన దూబే క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకుని ఆ తర్వాత తనదైన శైలిలో బ్యాటు ఝులిపించాడు. మందకోడిగా సాగుతున్న ఇన్నింగ్స్ను భారీ సిక్స్లతో ఉషారు తెప్పించాడు. తన ట్రేడ్మార్క్ షాట్లతో విరుచుకుపడుతూ 25 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. సూర్య ఔటైనా..హార్దిక్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో కనీసం 160 స్కోరు అయినా దాటుతుందా అన్న అంచనాలను తలకిందులు చేస్తూ టీమ్ఇండియాకు భారీ స్కోరు అందించడంతో కీలకమయ్యాడు. వాన్ బీక్ బౌలింగ్లో క్యాచ్ ఔట్తో ఐదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
లక్ష్యఛేదనలో డచ్ టీమ్ అద్భుత పోరాట పటిమ ప్రదర్శించింది. మెగాటోర్నీలో ఆఖరి మ్యాచ్ ఆడిన నెదర్లాండ్స్..ఒక రకంగా భారత్కు దీటైన పోటీనిచ్చింది. టీమ్ఇండియా బౌలింగ్కు పరీక్ష పెడుతూ కండ్లు చెదిరే రీతిలో షాట్లు ఆడింది. ఓపెనర్లు లెవిట్(24), మ్యాక్స్ వో డౌడ్(20) ఒకింత మెరుగైన శుభారంభాన్ని అందించారు.
అయితే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ఎంట్రీతో ఇన్నింగ్స్ స్వరూపం మారిపోయింది. వరుణ్ బౌలింగ్ను అంచనా వేయలేకపోయిన డచ్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. అకెర్మన్(23), ఆర్యన్దత్(0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన వరుణ్..టీమ్ఇండియాను పోటీలోకి తీసుకొచ్చాడు. టోర్నీలో సూపర్-8 మ్యాచ్లను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ సూర్య పలు ప్రయోగాలు చేశాడు. దూబేను బౌలింగ్ దించగా డచ్ బ్యాటర్లు అంతే దీటుగా సమాధానమిచ్చారు. దూబేకు తోడు హార్దిక్, సుందర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆఖర్లో విజయానికి దగ్గరికి వచ్చిన డచ్ టీమ్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
భారత్: 20 ఓవర్లలో 193/6(దూబే 66, తిలక్వర్మ 31, వాన్ బీక్ 3/56, ఆర్యన్ 2/19), నెదర్లాండ్స్: 20 ఓవర్లలో 176/7(బాస్ డీలిడె 33, లియాన్ కాచెట్ 26, వరుణ్ 3/14, దూబే 2/35)