ఆసియా చాంపియన్స్ భారత్కు ఆదిలోనే చుక్కెదురైంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న టీమ్ఇండియాకు ఇంగ్లండ్ దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. వాంఖడేలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ స్కీవర్, వ్యాట్ అర్ధసెంచరీలతో ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపారు. ఫలితంగా భారీ స్కోరు అందుకున్న ఇంగ్లండ్.. బౌలింగ్లోనూ ఇరగదీస్తూ టీమ్ఇండియాను నిలువరించింది. లక్ష్యఛేదనలో షెఫాలీ వర్మ మినహా అందరూ విఫలం కావడంతో ఓటమి ఎదుర్కొవాల్సి వచ్చింది.
ముంబై: సొంతగడ్డపై పొట్టిఫార్మాట్లో బోణీ కొడుదామనుకున్న భారత్కు నిరాశే ఎదురైంది. బుధవారం వాంఖడేలో ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 పోరులో హర్మన్ప్రీత్కౌర్ కెప్టెన్సీలోని టీమ్ఇండియా 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకంజలో నిలిచింది. తొలుత స్కీవర్ బ్రంట్(53 బంతుల్లో 77, 13ఫోర్లు), వ్యాట్(47 బంతుల్లో 75, 8ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 197/6 స్కోరు చేసింది. రేణుకాసింగ్(3/27), శ్రేయాంక పాటిల్(2/44) రాణించారు.
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా 159/6 స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్ షెఫాలీవర్మ(42 బంతుల్లో 52, 9ఫోర్లు) అర్ధసెంచరీతో ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయింది. సహచరుల నుంచి సరైన సహకారం లేకపోవడంతో జట్టు ఓటమిపాలైంది. ఎకల్స్టోన్(3/15) మూడు వికెట్లతో టీమ్ఇండియా పతనాన్ని శాసించింది. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన స్కీవర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 9న జరుగనుంది.
స్కీవర్, వాట్ అదుర్స్:
తొలుత టాస్ గెలిచిన భారత్..ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. రేణుకా సింగ్ వేసిన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో సోఫీ డంక్లె(1), అలైస్ క్యాప్సె(0) వెనుదిరిగారు. దీంతో టీమ్ఇండియాకు అదిరిపోయే ఆరంభం దక్కిందని అనుకున్నారు. కానీ వ్యాట్, స్కీవర్ ఇన్నింగ్స్ గతిని మార్చేశారు. వీరిద్దరు ఎదురుదాడికి దిగి పరుగులు కొల్లగొట్టారు. వ్యాట్, స్కీవర్ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో పవర్ప్లే ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.
ఈ జోడీనివిడగొట్టేందుకు కెప్టెన్ హర్మన్ప్రీత్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న సైకా ఇషాక్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. దీంతో ఇదే అదనుగా స్కీవర్, వ్యాట్ తమదైన రీతిలో విరుచుకుపడుతూ పరుగులు కొల్లగొట్టారు. ఇషాక్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వ్యాట్ ఔట్ కావడంతో మూడో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. టీ20ల్లో భారత్పై ఇంగ్లండ్కు ఇది తొలి సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 197/6(స్కీవర్ 77, వ్యాట్ 75, రేణుకా సింగ్ 3/27, శ్రేయాంక పాటిల్ 2/44), భారత్: 20 ఓవర్లలో159/6(షెఫాలీవర్మ 52, హర్మన్ప్రీత్ 26, ఎకల్స్టోన్ 3/15, గ్లెన్ 1/25)