క్రికెట్ను మతంలా భావించే దేశంలో.. అభిమానులు చిరకాలం గుర్తుంచుకునే ప్రదర్శనతో భారత మహిళల జట్టు అదరగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో హర్మన్ప్రీత్ బృందం ఫైనల్కు దూసుకెళ్లింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన సుడిగాలి ఇన్నింగ్స్కు బౌలర్ల సహకారం తోడవడంతో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ జయభేరి మోగించి పతకం పక్కా చేసుకుంది!
బర్మింగ్హామ్: అంచనాలకు మించి రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్లో టీమ్ఇండియా 4 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ను చిత్తుచేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మందన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. స్మృతి ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తిస్తే.. జెమీమా రోడ్రిగ్స్ (44 నాటౌట్; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20), దీప్తి శర్మ (22), షఫాలీ వర్మ (15) తలా కొన్ని పరుగులు చేయడంతో టీమ్ఇండియం మంచి స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. స్కీవర్ (41), డానీ వ్యాట్ (35), అమీ జోన్స్ (31) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు పడగొట్టింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 164/5 (స్మృతి 61, జెమీమా 44 నాటౌట్; కెంప్ 2/22), ఇంగ్లండ్: 20 ఓవర్లలో 160/6 (స్కీవర్ 41, వ్యాట్ 35; స్నేహ్ రాణా 2/28).