ODI World Cup | వన్డే వరల్డ్ కప్లో వరుసగా నాలుగు విజయాలు సాధించి దూకుడుమీదున్న భారత క్రికెట్ జట్టు ఆదివారం (అక్టోబర్ 22) ధర్మశాల వేదికగా కీలక పోరులో తలపడనున్నది. ఈమ్యాచ్ లో ఇదివరకే గాయం కారణంగా హార్ధిక్ పాండ్యా దూరం కాగా తాజాగా మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా కివీస్తో మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్తో రెండ్రోజుల క్రితం ముగిసిన మ్యాచ్లో జడేజా మోకాలి నొప్పితో బాధపడ్డట్టు సమాచారం. దీంతో జడేజాను ఆదివారం ఆడించాలా..? వద్దా..? అన్నది ఆదివారం మ్యాచ్కు ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జడ్డూ గాయంపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నా కీలక మ్యాచ్లు ముందున్న తరుణంలో జడ్డూను పక్కనబెట్టనున్నారని తెలుస్తున్నది.
బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముగిశాక జడేజా తన మోకాలిపై ఐస్ బ్యాగ్తో మర్దనా చేస్తూ కనిపించాడు. జడ్డూ గాయంపై భారత క్రికెట్ జట్టుకు చెందిన ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికి జడేజా అయితే బాగానే ఉన్నాడు. ఒక సర్జరీ జరిగినప్పుడు ఇలాంటివి సహజమే. పాత గాయాలు తిరిగి వేధిస్తుంటాయి. అందుకే జడ్డూ తన మోకాలికి ఐస్ ప్యాక్ తో మర్దనా చేశాడు. జడ్డూ గాయంపై ఇప్పటికైతే ఆందోళన చెందాల్సినదేమీ లేదు. మెడికల్ టీమ్ జడేజాతో పాటు అందరు ఆటగాళ్లపై దృష్టి సారించింది..’ అని చెప్పాడు.
కాగా గతేడాది ఆసియా కప్ (టీ20)లో గాయపడ్డ జడ్డూ మోకాలికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. సర్జరీ కారణంగా జడ్డూ ఆ ఏడాది టీ20 ప్రపంచకప్ నుంచి కూడా తప్పుకున్నాడు. సుమారు ఆరు నెలల విరామం తర్వాత బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రీఎంట్రీ ఇచ్చాడు. ఇదివరకే హార్థిక్ దూరమైన నేపథ్యంలో జడ్డూను కివీస్తో పోరులో ఆడిస్తారా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది.