పుణె: ఆల్రౌండర్ మిషెల్ మార్ష్ (132 బంతుల్లో; 177 నాటౌట్; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన తొలి పోరులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. మెగాటోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాల తర్వాత ఆసీస్ అజేయంగా నిలుస్తూ.. 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంతో లీగ్ దశను ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.
తౌహిద్ (74) టాప్ స్కోరర్ కాగా.. తన్జిద్ (36), లిటన్ దాస్ (36), నజ్ముల్ (45), మహ్ముదుల్లా (32), ముష్ఫికర్ (21), మెహదీ హసన్ (29) తలాకొన్ని పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో అబాట్, జాంపా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆసీస్ 44.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. మార్ష్ భారీ సెంచరీకి తోడు వార్నర్ (53), స్మిత్ (63 నాటౌట్) హాఫ్సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, ముస్తఫిజుర్ చెరో వికెట్ తీశారు. మార్ష్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. గురువారం కోల్కతా వేదికగా జరుగనున్న రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది.
బంగ్లాదేశ్: 306/8 (తౌహిద్ 74, నజ్ముల్ 45; జాంపా 2/32, అబాట్ 2/61),
ఆస్ట్రేలియా: 44.4 ఓవర్లలో 307/2 (మార్ష్ 177 నాటౌట్, స్మిత్ 63 నాటౌట్; తస్కిన్ 1/61).