వన్డే ప్రపంచకప్ ప్రారంభ సమరానికి అభిమానులు పోటెత్తుతారని భావించిన బీసీసీఐకి.. తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో జరిగిన వరల్డ్కప్ (CWC) ఆరంభ పోరుపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. టీమ్ఇండియా బరిలోకి దిగకపోవడంతో పాటు.. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఫ్యాన్స్ ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు రాకపోయి ఉండవచ్చని స్థానిక అధికారులు పేర్కొన్నారు. నాలుగేండ్లకోసారి నిర్వహించే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని కనీస ఆరంభ వేడుకలు లేకుండా మొదలు పెట్టడం కూడా చేటు చేసి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
వన్డేలకు ప్రభ తగ్గుతుందనే వాదనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్ భవిష్యత్తుపై ఈ మ్యాచ్ మరిన్ని సందేహాలు లేవనెత్తింది. గత వరల్డ్కప్ ఫైనలిస్ట్లు పోటీపడ్డ పోరు ఆరంభంలో 1.32 లక్షల సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్ స్టేడియంలో పట్టుమని పది వేల మంది కూడా కనిపించలేదు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయానికి మైదానంలో ప్రేక్షకుల సంఖ్య 47 వేలకు చేరింది. దీనిపై గుజరాత్ క్రికెట్ సంఘం ప్రతినిధి మాట్లాడుతూ.. ‘50 నుంచి 60 వేల మంది అభిమానులు వస్తారని ఆశించాం. భారత్ బరిలోకి దిగకపోవడంతో ఫ్యాన్స్ స్టేడియానికి రాలేదు. ఎండ వేడిమి కారణంగా కూడా అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపి ఉండకపోవచ్చు’ అని వెల్లడించారు.