సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 27 : శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపించి, మరణం అంచులదాకా వెళ్లి రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. 14ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో వెన్నుచూపకుండా, అరాచకాలకు, అలజడికి తావు లేకుండా గాంధీ మార్గానికే వన్నె తెచ్చినయోధుడు అని పేర్కొన్నారు. శాంతియుత స్వభావానికి గాంధీజీ మారుపేరైతే.. అదే స్వభావానికి మరింత పదునుపెట్టి గమ్యాన్ని చేరుకున్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంపై గులాబీ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను సాదాసీదాగా నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన అంశాన్ని అవకాశంగా వినియోగించుకుని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు.
లక్ష్యం దిశగా ఉద్యమాన్ని నడిపి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తూ దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరుగడించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టుకే సంచలనం సృష్టిస్తే.. 20ఏండ్ల ప్రస్థానంలో అనేక అపురూప ఘట్టాల ఆవిష్కరణకు వేదికైందని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలను తట్టుకొని చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్ అని అన్నారు. సీమాంధ్ర పాలకుల హయాంలో తీవ్ర అన్యాయానికి గురైన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు స్వరాష్ట్రంలో అనేక మేళ్లు జరిగాయన్నారు.
ఆరున్నరేండ్లలోనే వరి సాగు, దిగుబడిలో ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఫ్లోరైడ్ విముక్తి దిశగా మిషన్ భగీరథకు పునాది వేసి ఇంటింటికీ తాగునీరందిస్తున్నారని, 2లక్షల ఎకరాలకే పరిమితమైన సేద్యం.. నేడు 11.50లక్షలకు చేరడం ముఖ్యమంత్రి అవ్యాజప్రేమకు నిదర్శనమని తెలిపారు. అధినేత చల్లని చూపుతోనే మెడికల్ కళాశాలలు, పవర్ ప్లాంటు దక్కాయన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్తో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.