హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ షట్లర్ పీవీ సింధును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు..కెనడా ప్లేయర్ మిచెల్లీ లీపై అలవోక విజయం సాధించింది. మెగాటోర్నీలో సింధు.. స్వర్ణ పతకం సాధించడం పట్ల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు.
యావత్ జాతి గర్వించదగ్గ క్రీడాకారిణి అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే మంత్రులు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్.. సింధును అభినందనలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని మంత్రులు తెలిపారు. రాష్ర్టాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో రూపొందిస్తున్నామన్నారు. భవిష్యత్లో దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలతో సత్తాచాటిన నిఖత్ జరీన్, పీవీ సింధు, ఆకుల శ్రీజ, పుల్లెల గాయత్రి గోపీచంద్, సాత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టి, శరత్ కమల్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మెగాటోర్నీలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా సత్తాచాటిన ప్లేయర్ల ప్రతిభను ట్విట్టర్లో ప్రశంసించారు. ఒక్కొక్కరి ప్రదర్శనను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.