బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. మెగా టోర్నీలో అద్భుత ఆటను కొనసాగిస్తూ పురుషుల డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 19-21, 22-20, 21-16 తేడాతో 9వ ర్యాంకర్, మలేషియాకు చెందిన గో సజీ ఫీ – నూర్ ఇజుద్దీన్ జోడీపై ఉత్కంఠ విజయం సాధించింది.
82 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకున్న భారత జోడీ ప్రత్యర్థికి చెక్ పెట్టింది. ఈ ఏడాది సాత్విక్ -చిరాగ్ జోడీకి ఇదే తొలి ఫైనల్ కావడం గమనార్హం. గతంలో 2019, 2024లలో ఇక్కడ టైటిల్ గెలిచిన భారత జోడీ.. ఈ టోర్నీలో మూడోసారి ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఇండోనేషియా ద్వయం లియో రాలీ కర్నాండో – డేనియల్ మార్థిన్ జోడీతో అమీతుమీ తేల్చుకోనుంది.