Smriti Mandhana : స్టార్ క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారని తెలిసిందే. తమ ఫేవరెట్ ఆటగాళ్లను చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తుంటారు కొందరు ఫ్యాన్స్. తాజాగా 19వ ఆసియా గేమ్స్(Asian Games 2023)లో అలాంటి సంఘటనే జరిగింది. అది కూడా క్రికెట్ ఆట ఏమంత ప్రాచుర్యంలోని చైనా గడ్డపై. అవును.. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana)ను చూసేందుకు చైనా అభిమాని ఒకరు 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. అందుకోసం ఏకంగా 1000 యువాన్లు(భారత కరెన్సీలో రూ.11,400) ఖర్చు పెట్టాడు.
అతడి పేరు జున్ యూ(Jin Yu). మంధాన ఆట చూడడం కోసం బీజింగ్ నుంచి హంగ్జైకి వచ్చానని అతను చెప్పాడు. మంధాన ఆట అంటే ఇష్టం. ఆమె సూపర్ క్రికెటర్. ఆమె ఆటను స్వయంగా చూడడం కోసం ఇక్కడికి వచ్చాను అని జున్ తెలిపాడు. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ సమయంలో జున్ ‘మంధాన ది గాడెస్'(Mandhana The Goddess) అని రాసున్న ప్లకార్డ్ పట్టుకొని కనిపించాడు. దాంతో, అతడి ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. జున్ ఫొటో చూసిన చాలామంది ‘ఎల్లలు దాటిన అభిమానం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్మృతి మంధాన
గమ్మత్తైన విషయం ఏంటంటే.. జున్కు క్రికెట్ ఆడడం రాదు. కానీ, భారత క్రికెటర్లు అంటే అతడికి చాలా ఇష్ఠం. అతడి ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరో తెలుసా..? ‘సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు స్మృతి మంధాన ఆట అంటే చాలా ఇష్టం. ఆస్ట్రేలియాపై 2019 వరల్డ్ కప్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ప్రదర్శన చూశాను. అప్పటి నుంచి అతడి ఫ్యాన్ అయిపోయా అని జున్ తెలిపాడు. అంతేకాదు బీజింగ్లో తాను చదువుకున్న యూనివర్సిటీలో క్రికెట్ పాఠాలు చెప్పేవారని, అలా తనకు ఈ ఆట గురించి కొంచెం తెలుస’ని జున్ చెప్పుకొచ్చాడు.
భారత మహిళల క్రికెట్(Indian Womens Team) జట్టు ఆసియా గేమ్స్లో చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో తొలిసారి అడుపెట్టడమే కాకుండా ఏకంగా గోల్డ్ మెడల్ దక్కించుకుంది. శ్రీలంక(Srilanka)తో జరిగిన టైటిల్ పోరులో మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్(42) రాణించారు. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి లంక 97 పరుగులకే కుప్పకూలింది. దాంతో, టీమిండియా 19 పరుగుల తేడాతో గెలుపొందింది.