IPL 2O23 : ఐపీఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరింది. ట్రోఫీ విజేత ఎవరో తేలేందుకు రెండంటే రెండే మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఈరోజు క్వాలిఫైయర్ 2(Qualifier 2) పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్( Gujarat titans), ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఢీ కొంటున్నాయి. ఫైనల్ బెర్తును నిర్ణయించే ఈ మ్యాచ్ టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఆయితే.. టికెట్ ప్రింటింగ్ కోసం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియానికి వచ్చిన అభిమానులకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. భారీ క్యూ ఉండడంతో ఫ్యాన్స్ ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో, అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. గ్రౌండ్ సిబ్బంది, పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
సొంత గ్రౌండ్లో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడుతున్న తమ అభిమాన క్రికెటర్లకు మద్దతుగా నిలిచేందుకు వేలాది మంది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ, నిబంధనల ప్రకారం తప్పనిసరిగా స్టేడియం దగ్గర టికెట్ ప్రింటవుట్ తీసుకోవాలి. దాంతో, గురువారం (మే 25) ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటర్ తెరిచి ఉంచారు. దాంతో, ఫ్యాన్స్ భారీగా స్టేడియానికి తరలివచ్చారు. తమ క్యూ ఆర్ కోడ్ చూపించి బాక్సాఫీస్ కౌంటర్ వద్ద టికెట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంది. దాంతో, ఎండలో గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చున్నారు. స్టేడియం సామర్థ్యం దాదాపు లక్ష మందికి పైనే. దాంతో, ఫైనల్ టికెట్ల కోసం శనివారం కూడా ఇదే సీన్ పునరావృతం కానుందని గ్రౌండ్ సిబ్బంది ఒకరు తెలిపారు.
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్
టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 1 పోరులో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కంగుతిన్నది. చెపాక్ స్టేడియంలో మొదట చెన్నై 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు కొట్టింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60) అర్ధ శతకంతో మెరిశాడు. ఛేజింగ్లో హార్దిక్ పాండ్యా సేన 157 రన్స్కే ఆలౌటయ్యింది. దాంతో, ఫైనల్ బెర్తు కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత ముంబై ఇండియన్స్తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ పోరులో గెలిచిన జట్టు ఫైనల్కు వెళ్తుంది. ఆదివారం నాడు సీఎస్కేతో టైటిల్ పోరులో తలపడుతుంది.