రెండేండ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధు ఎట్టకేలకు తన కోరిక తీర్చుకుంది. కరోనా కష్టకాలంలో సాగిన టోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపిన తెలుగమ్మాయి.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచింది.
లక్నో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ -300 టోర్నీ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్లో విజేతగా నిలిచింది. కరోనా కేసుల కారణంగా పలువురు ఆటగాళ్లు టోర్నీకి దూరం కాగా.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-13, 21-16తో భారత్కే చెందిన మాళవిక బన్సోద్పై విజయం సాధించింది. 35 నిమిషాల్లో ముగిసిన తుదిపోరులో సింధు తన అనుభవాన్ని రంగరించి సత్తాచాటింది. ఆట ఆరంభం నుంచి విజృంభించిన సింధు తొలి గేమ్ బ్రేక్ సమయానికి 11-1తో ముందంజలో నిలిచి అదే జోరులో గేమ్ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్లోనూ ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాకపోవడంతో అలవోకగా టైటిల్ చేజిక్కించుకుంది. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రీ గోపీచంద్-త్రిషా జాలీ జంట రన్నరప్గా నిలువగా.. మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్-తనిషా జంట టైటిల్ కైవసం చేసుకుంది.