ఎడ్జ్బాస్టన్ వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లండ్ తో మొదలుకావాల్సి ఉన్న టెస్టులో టీమిండియాను జస్ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా కొవిడ్ నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో బుమ్రా పేరును బీసీసీఐ ఖరారు చేసింది. మ్యాచ్ నాటికల్లా రోహిత్ శర్మ కోలుకుంటాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. గురువారం జరిపిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో కూడా రోహిత్ కు పాజిటివ్ అనే తేలింది.
రోహిత్ ఇంకా కోలుకోకపోవడంతో ఐదో టెస్టుకు బుమ్రా ను సారథిగా నియమించినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. అతడి ఆరోగ్య పరిస్థితిపై బుధవారంతో పాటు గురువారం కూడా సమావేశమైన ఆలిండియా సెలక్షన్ కమిటీ.. హిట్ మ్యాన్ ఈ టెస్టుకు అందుబాటులో ఉండటం అసాధ్యం అని తేలడంతో అతడి స్థానంలో బుమ్రాను భారత జట్టు సారథిగా నియమించింది. రిషభ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది.
బీసీసీఐ తాజా ప్రకటనతో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. 1987 తర్వాత భారత జట్టుకు సారథిగా నియమితుడైన పేస్ బౌలర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు. 1983 నుంచి 87 వరకు దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ భారత్ కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే (స్పిన్నర్) మినహా నాయకులంతా బ్యాటర్లే కావడం గమనార్హం.