ODI World Cup – England : స్వదేశంలో 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు ప్రసుతం భారత్లో ఆడుతున్న టీమ్లో పెద్దగా తేడాలేమీ లేవు. బెయిర్స్టో, రూట్, బెన్ స్టోక్స్, బట్లర్, వోక్స్, వుడ్, రషీద్ అప్పుడూ జట్టులో ఉన్నారు.. ప్రస్తుతం ఆడుతున్న జట్టులోనూ ఉన్నారు. మరీ నాలుగేండ్ల క్రితం ప్రత్యర్థులపై ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడిన ఇంగ్లిష్ టీమ్.. ఊహించని విధంగా పాతాళానికి పడిపోవడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా 2019లో విజేతగా నిలిచిన ఆ జట్టుకు.. ప్రస్తుత టీమ్కు ప్రధాన తేడా కెప్టెన్సీనే అనే వాదన బలంగా వినిపిస్తున్నది.
నాలుగేండ్ల క్రితం స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించాడు. స్వతహాగా ఐర్లాండ్ ప్లేయర్ అయిన మోర్గాన్.. మిడిలార్డర్లో బ్యాటింగ్ వచ్చి నాలుగో స్థానంలో జట్టులో స్థిరత్వం నింపేవాడు. ప్రస్తుతం వన్డేల్లో ఇంగ్లండ్కు బట్లర్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. అప్పటి జట్టుకు, ఇప్పటి టీమ్కు ప్రధానంగా ఇద్దరు ప్లేయర్లు మాత్రమే అందుబాటులో లేరు. ఆ టోర్నీలో ఓపెనర్ జాసెన్ రాయ్తో పాటు.. పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఉండగా.. ఇప్పుడు ఆ ఇద్దరి బదులు నాణ్యమైన ప్లేయర్లు టీమ్లో చోటు దక్కించుకున్నారు. అయినా ఇంగ్లండ్ మాత్రం ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోతున్నది.
వరల్డ్ కప్ ట్రోఫీతో మోర్గాన్ సేన
డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆడిన ఆరు మ్యాచ్ల్లో కేవలం ఒక్క దాంట్లోనే నెగ్గింది. మ్యాచ్ ఫలితం పక్కన పెడితే.. అసలు ఇంగ్లండ్ జట్టు ఆటతీరులోనే ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ న తొలి మ్యాచ్లో 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులకే పరిమితమైంది. అనంతరం న్యూజిలాండ్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఫలితంతో ఇంగ్లిష్ టీమ్ బౌలింగ్ డొల్లతనం బయట పడింది. ఆ తర్వాత బ్యాటింగ్పై దృష్టి పెట్టిన బట్లర్ సేన.. తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 364 పరుగుల భారీ స్కోరు చేసింది. అంత పెద్ద ఛేదనలో బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆలౌటైంది.
బంగ్లాపై విజయం అనంతరం ఇంగ్లిష్ జట్టు జోరు పెంచాల్సింది పోయి.. మరీ నాసరికమైన ఆటతీరుతో నానాటికీ తీసికట్టులా మారింది. 2019లో అఫ్గానిస్థాన్పై రికార్డు స్థాయిలో సిక్సర్లు కొట్టి ఆ జట్టు ఆత్మౖస్థెర్యాన్ని దెబ్బతీసిన ఇంగ్లండ్.. ఈ సారి అఫ్గన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అయింది. అఫ్గాన్ నిర్దేశించిన 284 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. ఒకటి నుంచి పదో స్థానం వరకు హిట్టర్లతో దట్టంగా ఉన్న ఇంగ్లిష్ జట్టు అఫ్గాన్ చేతిలో ఇలా ఆలౌట్ కావడం వాళ్ల ఆత్మౖస్థెర్యాన్ని దెబ్బతీసింది. 2019లో ఇదే అఫ్గాన్తో జరిగిన పోరులో అప్పటి కెప్టెన్ మోర్గాన్ సిక్సర్ల మోత మోగించి జట్టులో జవసత్వాలు నింపగా.. ఇప్పుడు బట్లర్ నుంచి అలాంటి ఇన్నింగ్స్ కరువైంది. ఇక ఆ తర్వత దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో ఇంగ్లిష్ బౌలర్లు మరీ నాసరికం ప్రదర్శన కనబర్చారు.
అఫ్గన్ స్పిన్నర్లకు దాసోహమైన ఇంగ్లండ్
ముంబై వాంఖడే పిచ్పై జరిగిన పోరులో ఇంగ్లండ్ బౌలర్లను గల్లీ ప్లేయర్లుగా మారుస్తూ దక్షిణాఫ్రికా దంచికొట్టింది. బట్లర్ సేన ముందు నాలుగొందల పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంత పెద్ద లక్ష్యం కండ్ల ముందు కనిపిస్తుంటే కనీస పోరాటం కనబర్చకుండా బట్లర్ గ్యాంగ్ 22 ఓవర్లలో 170 పరుగులకే చాపచుట్టేసింది. ఆ తర్వాత శ్రీలంకతో పోరులో ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్ ఆకట్టుకోలేకపోయింది. 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. 229 పరుగుల ఛేదనలో షమీ, బుమ్రా ధాటికి 129 రన్స్కే ఆలౌటైంది.
ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకుంటున్న నెదర్లాండ్స్, అఫ్గానిస్థాన్ వంటి జట్లు కడవరకు పోరాడాలని చూస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. గత మూడు మ్యాచుల్లో కనీసం 40 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వరల్డ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీమ్ ఇలా నేల చూపులు చూస్తుండటం.. ఆ దేశ మాజీలు, అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు. ఇటీవలి కాలంలో ‘బజ్బాల్’ అంటూ టెస్టుల్లోనూ టీ20 తరహా ఆటతీరు కనబరుస్తున్న ఇంగ్లండ్ మరీ వన్డేల్లో మాత్రం ఇలాంటి చెత్త ప్రదర్శన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
షమీ బౌలింగ్లో బౌల్డ్ అయిన స్టోక్స్
వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ను బతిలాడిప్రపంచకప్ కోసం తీసుకొచ్చినా.. జట్టు రాత మాత్రం మారలేదు. గాయం కారణంగా తొలి దశ మ్యాచ్లకు అతడు అందుబాటులో లేకుండా పోగా.. ఆ తర్వాత వచ్చినా పెద్దగా ఫలితంలో మాత్రం మార్పు రాలేదు. దీంతో కెప్టెన్సీలోనే లోపం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత టోర్నీలో ఆడిన ఆటగాళ్లు దాదాపుగా అందుబాటులో ఉన్నా.. బట్లర్ వాళ్లను సమర్ధంగా వినియోగించుకోలేకపోతున్నాడని.. అదే మోర్గాన్ పరిమిత వనరులను సైతం అద్భుతంగా వాడుకొని జట్టును జగజ్జేతగా నిలిపాడని మాజీలు అంటున్నారు.