Mayank Agarawal | టీమిండియా ఓపెనర్, ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో కర్నాటక రంజీ క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ ఇటీవలే విమానంలో కలుషిత నీరు తాగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనతో రెండు వారాల పాటు ఆటను వదిలేసి ఇంటికే పరిమితమైన అగర్వాల్.. విమాన ప్రయాణాల్లో సొంత వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాడు. మళ్లీ విమానంలో నీళ్లు తాగితే లేనిపోని తలనొప్పులు ఎందుకనుకున్నాడో ఏమో గానీ అగర్వాల్.. విమానంలో వెళ్తూ తన సొంత బాటిల్ను చూపుతున్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా త్రిపురతో అగర్తలాలో మ్యాచ్ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో అతడు విమానంలో కలుషిత నీటిని తాగడంతో అతడి నోటితో పాటు గొంతులో తీవ్ర మంట రావడంతో ఆస్పత్రి పాలయ్యాడు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్న అగర్వాల్.. ఆ తర్వాత బెంగళూరుకు తిరిగొచ్చి రెండువారాల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా కర్నాటక జట్టు క్వార్టర్స్ చేరిన నేపథ్యంలో అతడు హుబ్లీ నుంచి నాగ్పూర్కు విమానంలో వెళ్తుండగా వాటర్ పౌచ్ను పట్టుకున్న ఫోటోను ట్విటర్లో అప్లోడ్ చేశాడు. ‘రిస్క్ అస్సలు తీసుకోవద్దు’ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. క్షవరం అయితే గానీ వివరం అర్థం కాలేదంటే ఇదేనేమో అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
Bilkul bhi risk nahi lene ka re babaaaaa ! pic.twitter.com/eeZy3N1qys
— Mayank Agarwal (@mayankcricket) February 19, 2024
ఇదిలాఉండగా రంజీ ట్రోఫీలో లీగ్ దశలో ఏడు మ్యాచ్లు ఆడి మూడింట గెలిచి ఒకదాంట్లో ఓడింది. మూడు మయాచ్లు డ్రా అయ్యాయి. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కర్నాటక క్వార్టర్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఎలైట్ గ్రూప్ – సి లో ఉన్న కర్నాటక.. తమిళనాడు తర్వాత రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్స్లో కర్నాటక.. తమ తొలి మ్యాచ్ను ఈనెల 23న విదర్భతో ఆడనుంది.