హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్లో తమిళ్ తలైవాస్ ఐదో విజయం నమోదు చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో తలైవాస్ 45-28తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున నరేందర్ 14 పాయింట్లతో సత్తాచాటితే.. అజింక్యా పవార్ 11 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తలైవాస్ కెప్టెన్ సాగర్ డిఫెన్స్లో రాణించి ఐదు ట్యాకిల్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బెంగళూరు తరఫున అక్షిత్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా.. అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. మరో మ్యాచ్లో పుణెరీ పల్టన్ 34-21తో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. జైపూర్ పింక్ పాంథర్స్ 58 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పుణెరీ పల్టన్ 57 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.