హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మొదటి పోరుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. 2018 తర్వాత జరుగుతున్న టెస్టు పోరుపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. దీనికి తోడు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో కీలకమైన సిరీస్ కావున ఇరు జట్లు పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మంగళవారం స్టేడియంలో ఇరు జట్ల ప్లేయర్లు గంటల కొద్ది నెట్స్లో చెమటోడ్చారు. తొలుత ఇంగ్లండ్ ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనగా, ఆ తర్వాత టీమ్ఇండియా క్రికెటర్లు సన్నాహలు చేశారు. పిచ్ స్పిన్కు అనుకూలించనున్న నేపథ్యంలో నెట్స్లో క్రికెటర్లు ఎక్కువగా స్పిన్ను ఎలా ఎదుర్కొవాలనే దానిపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
కెప్టెన్ రోహిత్శర్మ చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత మైదానంలో సహచర ప్లేయర్లతో కలిసి వామప్లో పాల్గొన్నాడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొన్నది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్శర్మ ఖరారు కాగా, వన్డౌన్లో శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్ బాధ్యతలను మోయనున్నారు. అయితే త్రోడౌన్స్ వేసే సమయంలో శ్రేయాస్ అయ్యర్కు గాయమైంది. నొప్పితో బాధపడిన అయ్యర్ ప్రాక్టీస్ను అర్ధాంతరంగా ముగించాడు. గురువారం నాటికి అయ్యర్ అందుబాటులో ఉంటాడా లేడా అన్నది తెలియాల్సి ఉంది. లోకల్ స్టార్ సిరాజ్..సొంతగడ్డపై సత్తాచాటేందుకు తహతహలాడుతున్నాడు.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్గానే బరిలోకి దిగుతాడని.. టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి ఉప్పల్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించిన నేపథ్యంలో మంగళవారం ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘రాహుల్ వికెట్ కీపర్గా ఆడటం లేదు. సుదీర్ఘ సిరీస్ కావడంతో మరో ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేశాం. సఫారీ టూర్లో కేఎల్ అద్భుతంగా కీపింగ్ చేశాడు. కానీ ఇప్పుడు స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఆడుతాడు’అని ద్రవిడ్ పేర్కొన్నాడు. దీంతో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్, ధ్రువ్ జురేల్లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది.