Women IPL : ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన ఈ లీగ్లో మహిళా క్రికెటర్లు అద్భుతాలు చేయనున్నారు. తొలిసారిగా మహిళల ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా వేలం కోసం క్రికెటర్లు పేర్ల నమోదును ప్రారంభించింది. జనవరి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బీసీసీఐ తెలిపింది. ఫిబ్రవరిలో వేలం ప్రక్రియ జరగనుంది. జాతీయ జట్టుకు ఆడుతున్న ప్లేయర్ల కోసం మూడు కేటగిరీల రివర్స్ ప్రైజ్ను బీసీసీఐ ప్రకటించింది. వీళ్ల కనీస ధరను రూ.50 లక్షలు, రూ. 40 లక్షలు, రూ.30 లక్షలు ఉండనుంది. నాన్ క్యాప్ ప్లేయర్స్కు రూ.20 లక్షలు, రూ.10 లక్షల కనీస ధర నిర్ణయించింది. ఈ టోర్నీలో జాతీయ జట్టుకు ఆడుతున్నవాళ్లు, ఆరంగ్రేటం చేయని క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోనున్నారు. వేలంలో రిజిస్టర్ చేసుకునేందుకు రూ.5 లక్షలు చెల్లించాలని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వబోమని మహిళా క్రికెటర్లకు బీసీసీఐ ముందుగానే తెలిపింది.
బరిలో ఐదు జట్లు..
మహిళల తొలి ఐపీఎల్లో హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీరాజ్, స్మృతి మంధానా, షెఫాలీ వర్మ వంటి స్టార్ క్రికెటర్లు మెరుపులు మెరిపించనున్నారు. మొత్తం ఐదు జట్లు ఆడనున్నాయి. వేలంలో మహిళా క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈజట్లు ఇప్పటికే బెస్ట్ ప్లేయర్స్ను కనిపెట్టే బాధ్యతను తమ టాలెంట్ స్కౌట్స్కు అప్పగించాయి. మార్చి 3 నుంచి 26వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 22 గేమ్స్ జరుగుతాయి. ప్రతి జట్టు మరో జట్టుతో రెండు మ్యాచ్లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్కు దూసుకెళ్తుంది. రెండు, మూడు స్థానాల్లోని జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి. గెలుపొందిన జట్టు ఫైనల్కు వెళ్తుంది.
2017 వరల్డ్ కప్లో అదరగొట్టిన మహిళల జట్టు రన్నరప్గా నిలిచింది. దాంతో, మహిళల ఐపీఎల్ నిర్వహించాలనే డిమాండ్ మొదలైంది. 2020లో ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. అప్పటి నుంచి మహిళల ఐపీఎల్ టోర్నమెంట్కు మద్దతు ఇచ్చేవాళ్ల సంఖ్య పెరిగింది. ఈమధ్యే మహిళా క్రికెటర్లకు కూడా మగ క్రికెటర్లతో సమానమైన వేతనం ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.