గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో విరామాలకు సెలవు పెట్టి ఇకనుంచి భారత్ ఆడబోయే ప్రతీ సిరీస్లోనూ ఆడాలని ఆదేశించినట్టు బోర్డు వర్గాల సమాచారం.
గతంలో రోజులకొద్దీ క్రికెట్ ఆడినా క్రికెటర్లకు విశ్రాంతినిచ్చేవారు కాదు. ఆటగాళ్లు కూడా తాము ఫామ్ కోల్పోతే తప్ప విశ్రాంతి తీసుకున్న సందర్భాలూ తక్కువ. కానీ ఐపీఎల్, టీ20 సిరీస్లు పెరిగిపోవడంతో ఈ పరిస్థితి మారింది. ఈ మధ్య వరుసగా రెండు సిరీస్లు ఆడగానే కీలక ఆటగాళ్లు (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, కెఎల్ రాహుల్) విరామాలు కోరుతున్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిశాక ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. రొటేషన్ పాలసీ పేరిట ఒక సిరీస్లో ఆడిన ఆటగాడు (సీనియర్) మరో సిరీస్లో కనబడితే అది గొప్ప విషయంగా మారింది. తాజాగా వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ద్వితియశ్రేణి జట్టుతోనే భారత్ పోటీ పడింది. టీ20 సిరీస్కు రోహిత్, పంత్ వచ్చినా బుమ్రా, కోహ్లీలు విశ్రాంతిలోనే ఉన్నారు. ఈ సిరీస్ ముగిశాక జింబాబ్వేతో కూడా ‘సీనియర్లు’ అందుబాటులో ఉండరు.
కాగా, ఆసియా కప్ నుంచి ఇక రెగ్యులర్ ఆటగాళ్లెవరికీ విరామాలు కుదరవని బోర్డు, సెలక్టర్లు కఠిన ఆదేశాలు జారీ చేశారని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభంకావాల్సి ఉండగా ఆ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు ఆడుతుంది. వీటి తర్వాత అక్టోబర్ నుంచి ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది.
ఈ నేపథ్యంలో ఆసియా కప్ నుంచి ప్రతీ ఆటగాడు టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్కు అందుబాటులో ఉండాల్సిందేనని బీసీసీఐ ఆదేశించినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న కోహ్లీకి రాబోయే ఆసియా కప్ చాలా కీలకం కానున్నది. మరి సెలక్టర్ల ఆదేశాలను ‘సీనియర్లు’ పట్టించుకుంటారా..? లేక ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్నే ఫాలో అవుతారా..? అనేది కొద్దిరోజుల్లో తేలనుంది.