BCCI: ఇటీవలే స్వదేశంలో ఇంగ్లండ్తో పాటు ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. అగ్రశ్రేణి క్రికెట్ జట్లను మట్టికరిపించిన హర్మన్ప్రీత్ సేన.. పురుషుల క్రికెట్ మాదిరిగానే తమకూ దేశవాళీలో రెడ్బాల్ క్రికెట్ ఆడించక తప్పనిసరి పరిస్థితిని తీసుకొచ్చింది. పలువురు క్రికెట్ విశ్లేషకులు, భారత క్రికెట్ అభిమానులు సైతం మహిళలకూ రంజీల మాదిరిగా ఆడించాలని కోరారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకూ రెడ్ బాల్ క్రికెట్ అందుబాటులోకి తీసుకురానుంది.
జోనల్ ఫార్మాట్లో సాగబోయే ఈ మ్యాచ్లను మార్చి – ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు మహిళా క్రికెటర్లు సిద్ధమవుతుండగా ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే మహిళల రెడ్ బాల్ క్రికెట్ మొదలవనుంది. మెన్స్ దులీప్ ట్రోఫీ విధానం మాదిరిగా ఇవి ఉండనున్నట్టు సమాచారం. దేశవాళీలో పురుషుల రెడ్ బాల్ క్రికెట్లో నాలుగు రోజులు ఆడుతుండగా.. మహిళలకు మాత్రం మూడు రోజుల మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఫైనల్ మాత్రం నాలుగు రోజులు ఉండనుంది.
BCCI set to start domestic red-ball tournament for Women’s cricket after WPL 2024. [Express Sports]
– Great news for Women cricket fans….!!!!! pic.twitter.com/POai2Vds32
— Johns. (@CricCrazyJohns) January 13, 2024
మహిళలకు దేశవాళీ క్రికెట్లో 2014-15 సీజన్ నుంచి 2017-18 దాకా బీసీసీఐ ఇలాంటి మ్యాచ్లను నిర్వహించింది. కానీ తర్వాత పలు కారణాలతో వీటికి బ్రేక్ పడింది. కానీ గడిచిన రెండు మూడేండ్లలో మహిళల క్రికెట్కు కూడా క్రేజ్ ఊహించినదానికంటే ఎక్కువైంది. దేశంలోని చిన్న నగరాల నుంచి వందలాది మంది యువతులు క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంటున్న నేపథ్యంలో బీసీసీఐ దేశవాళీలో రెడ్ బాల్ క్రికెట్ పోటీలను తిరిగి ప్రారంభించనుంది.