Team India | న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమ్ఇండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా టీమ్కు దూరమైన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను రోహిత్ సేన ఇప్పటికే 3-1తో కైవసం చేసుకోగా.. నామమాత్రమైన చివరి టెస్టు ఈ నెల 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.
పేస్కు సహకరించనున్న ధర్మశాల పిచ్పై బుమ్రా అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావించిన సెలెక్షన్ కమిటీ అతడిని జట్టులోకి ఎంపిక చేసింది. సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన కేఎల్ రాహుల్.. ఆ తర్వాత గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. నాలుగో మ్యాచ్కు ముందే 90 శాతం ఫిట్నెస్ సాధించిన రాహుల్ రాంచీ టెస్టు ఆడుతాడనుకుంటే.. అనూహ్యంగా దూరమయ్యాడు. ఇప్పుడు చివరి పోరుకు కూడా అతడి పేరు లేకుండానే బోర్డు జట్టును ప్రకటించింది. మరోవైపు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను రంజీ ట్రోఫీ సెమీస్ ఆడేందుకు బోర్డు అనుమతిచ్చింది.
చివరి టెస్టుకు భారత జట్టు: రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, రజత్, సర్ఫరాజ్, ధ్రువ్, కేఎస్ భరత్, దేవదత్ పడిక్కల్, అశ్విన్, జడేజా, అక్షర్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్, ముఖేశ్, ఆకాశ్దీప్.