న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడాఅని అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి కల్గిస్తున్న భారత టీ20 జట్టుపై ఉత్కంఠ వీడింది. అంచనాలకు అనుగుణంగా అనుభవానికి, నిలకడైన ప్రదర్శనకు పెద్దపీట వేస్తూ చేతన్శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. ఐపీఎల్ ప్రదర్శనతో పాటు మెగాటోర్నీకి వేదికైన యూఏఈ, ఒమన్ పరిస్థితులకు అనుగుణంగా జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్గా రోహిత్శర్మ వ్యవహరించనున్నారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు సెలెక్టర్ల నుంచి అనూహ్య పిలుపు వచ్చింది. 2017 చాంపియన్స్ ట్రోఫీ నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్కు దూరంగా ఉంటున్న అశ్విన్ ఎంపిక అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ ఫామ్ను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు అశ్విన్ అనుభవానికి ఓటేశారు. ఈ క్రమంలో అశ్విన్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ జడేజా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, లెగ్స్పిన్నర్ రాహుల్ చాహర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్కు జట్టులో చోటు కల్పించారు. అయితే గత కొన్నేండ్లుగా టీమ్ఇండియా స్పిన్ బాధ్యతలు మోస్తున్న యజువేంద్ర చాహల్కు చుక్కెదురైంది. చాహల్ స్థానంలో వేగంగా బంతులు సంధించే యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ వైపు సెలెక్టర్లు మొగ్గుచూపారు. జడేజాకు అక్షర్ బ్యాకప్ ఆల్రౌండర్ అని పేర్కొన్న చైర్మన్ చేతన్శర్మ..చాహర్, చక్రవర్తి సర్ప్రైజ్ ప్యాకేజ్ అని అభివర్ణించాడు. షమీ, బుమ్రా, భువనేశ్వర్ కుమార్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.
బ్యాటింగ్ విషయానికొస్తే ఐపీఎల్లో నిలకడగా రాణిస్తూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ టీ20 ప్రపంచకప్ బెర్తు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, రోహిత్శర్మ జతగా ఇషాన్ కిషన్ మూడో ఓపెనర్గా వ్యవహరించనుండగా, సూర్యకుమార్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు రానున్నాడు. వీరిద్దరికి తోడు ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించనున్నాడు. హార్దిక్ ప్రస్తుతం ఫిట్గా ఉన్నాడని, పూర్తి ఓవర్ల కోటా వేసేందుకు సిద్ధమని శర్మ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే గత కొన్నేండ్లుగా పరిమిత ఓవర్ల ఓపెనర్గా వ్యవహరిస్తున్న శిఖర్ ధవన్కు సెలెక్టర్లు మొండిచేయి చూపించారు. జట్టులో చోటు దక్కించుకుంటారనుకున్న శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ స్టాండ్బై ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. అక్టోబర్ 17న యూఏఈ, ఒమన్లో టీ20 ప్రపంచకప్ మొదలుకానుండగా, 24న భారత్ తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడుతుంది.
అనూహ్యం, ఆశ్చర్యం! టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ.. అభిమానుల ఆశలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. గతేడాది పంద్రాగస్టు రోజున అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని టీ20 మెగాటోర్నీలో టీమ్ఇండియాకు మెంటార్గా ఎంపిక చేసింది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవమున్న ధోనీ సేవలను వాడుకునేందుకు సెలెక్షన్ కమిటీ మొగ్గుచూపింది. ఈ క్రమంలో బోర్డు కార్యదర్శి జైషా బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘దుబాయ్లో ఉన్న ధోనీతో నేను మాట్లాడాను. టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు సలహాదారునిగా ఉండేందుకు అతను ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని నా సహచరులతో పాటు కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్శర్మతో పంచుకున్నాను. దీనికి అందరూ అంగీకరించారు’ అని అన్నాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ధోనీ తన కెప్టెన్సీలో భారత్ను రెండు సార్లు(2007, 2011) ప్రపంచ విజేతగా నిలుపడంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
భారత టీ20 జట్టు: కోహ్లీ(కెప్టెన్), రోహిత్శర్మ(వైస్ కెప్టెన్), రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జడేజా, రాహుల్ చాహర్, అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీ.
స్టాండ్బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్,దీపక్ చాహర్.
భారత్ టీ20 షెడ్యూల్
అక్టోబర్ 24: భారత్ X పాకిస్థాన్
అక్టోబర్ 31: భారత్ X న్యూజిలాండ్
నవంబర్ 3: భారత్ X అఫ్గానిస్థాన్
నవంబర్ 5: భారత్ X బీ1
నవంబర్ 8: భారత్ X ఏ2