BCCI | ఐపీఎల్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ20లీగ్ల పట్ల ఆకర్షితులై రెడ్ బాల్ క్రికెట్కు దూరమవుతున్న క్రికెటర్లను తిరిగి టెస్టులకు రప్పించేందుకు బీసీసీఐ జబర్దస్త్ ప్లాన్ రెడీ చేసిందా..? ఔత్సాహిక క్రికెటర్లు ఐపీఎల్లో సంపాదించే మ్యాచ్ ఫీజులకు సమానంగా దేశవాళీలో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. దేశవాళీలో రంజీలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులను భారీగా పెంచనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్లాన్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే క్రికెటర్లకు కాసుల వర్షమే..
దేశవాళీలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో ఒక ప్లేయర్ అన్ని మ్యాచ్లను ఆడినట్టైతే సదరు ఆటగాడికి రూ. 75 లక్షలు.. ఒకవేళ ఓ క్రికెటర్ ఏడాదిలో అన్ని టెస్టు మ్యాచ్ (అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున)లు ఆడితే అతడికి మ్యాచ్ ఫీజుల ద్వారా రూ. 15 కోట్లు దక్కేలా బీసీసీఐ ప్రతిపాదనలు చేస్తున్నది. దీనిపై బోర్డు పెద్దలు.. టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమ్ మేనేజ్మెంట్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
రెడ్ బాల్పై ఆసక్తి పెంచేందుకే…
గత మూడేండ్లుగా రంజీ ట్రోఫీ ఆడేందుకు క్రికెటర్లు ఆసక్తి చూపడం లేదు. ఐపీఎల్ వేలం వరకూ దేశవాళీలలో ఆడుతున్న యువ క్రికెటర్లు.. ఒక్కసారి ఐపీఎల్లోకి వచ్చాక డొమెస్టిక్ క్రికెట్ వైపు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం రంజీ పూర్తి సీజన్ ఆడితే ఒక ప్లేయర్కు రూ. 25 లక్షలు దక్కుతున్నాయి. దానిని రూ. 75 లక్షలకు పెంచాలని బీసీసీఐ ప్రతిపాదిస్తోంది. ఐపీఎల్ వేలంలో ఒక ప్లేయర్కు మినిమం బేస్ ప్రైస్ రూ. 20 లక్షలుగా ఉంది. ఒకవేళ అతడు సీజన్లో పలు మ్యాచ్లు ఆడి సక్సెస్ అయితే అతడి దశ తిరిగినట్టే. దీంతో ఔత్సాహిక క్రికెటర్లు కూడా ఐపీఎల్ వేలంలో టీమ్ల దృష్టి పడేవరకే కష్టపడుతూ ఒక్కసారి ఐపీఎల్ కాంట్రాక్టు దక్కినాక డొమెస్టిక్ క్రికెట్లో ఐదు రోజుల పాటు రంజీలు ఆడేందుకు అంతగా ఆసక్తిచూపడం లేదు. ఇషాన్ కిషన్ ఉదంతమే దానికి ఉదాహరణ. ఇండియా తరఫున టెస్టులు ఆడే క్రికెటర్లకూ భారీగా మ్యాచ్ ఫీజులు పెంచితే అప్పుడు యువ క్రికెటర్లలో ఐపీఎల్ మీద ఉన్న క్రేజ్ కాస్తా టెస్టుల వైపునకు మొగ్గుతుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు.
గ్రేడ్ల విలువ కూడా…
మ్యాచ్ ఫీజులతో పాటు గ్రేడ్ల వారీగా ఇచ్చే కాంట్రాక్టుల విలువనూ పెంచనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ప్రస్తుతం బీసీసీఐ గ్రేడ్ ఏ+ క్రికెటర్లకు రూ. 7 కోట్లు, గ్రేడ్ ఏ కు రూ. 5 కోట్లు, గ్రేడ్ బి లో ఉన్నవారికి రూ. 3 కోట్లు, గ్రేడ్ సిలో ఉన్నోళ్లకు కోటి రూపాయల వేతనం అందిస్తోంది. కానీ బుధవారం వెల్లడించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో ఏ గ్రేడ్కు ఎంత ఇస్తామన్నది వెల్లడించలేదు. గ్రేడ్ల వారీగా ఇచ్చే వేతనాన్ని కూడా పెంచి మ్యాచ్ ఫీజులనూ పెంచితే క్రికెటర్లపై కనకవర్షమే..