ఐపీఎల్ ప్రసారహక్కుల ద్వారా దండిగా ఆర్జిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. మాజీ క్రికెటర్లు, అంపైర్లకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ సెక్రటరీ జై షా ట్విటర్ ద్వారా వెల్లడించారు. మాజీ క్రికెటర్ల (పురుషులు, మహిళలు) తో పాటు అంపైర్లకు నెలవారీ పెన్షన్ ను డబుల్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో సుమారు 900 మందికి ప్రయోజనం చేకూరనుంది.
జై షా స్పందిస్తూ.. ‘మన మాజీ క్రికెటర్లు, మ్యాచ్ సిబ్బంది నెలవారీ పెన్షన్ ను పెంచుతున్నానని తెలుపుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సుమారు 900 మంది దీని ద్వారా లబ్ది పొందనున్నారు. ఇందులో 75 శాతం మంది కంటే ఎక్కువ మంది 100 శాతం పెన్షన్ పెంపు అందుకోనున్నారు’ అని ట్వీట్ చేశారు. బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో గంగూలీ స్పందిస్తూ.. ‘మాజీ క్రికెటర్లు, సిబ్బంది బాగోగులు చూసుకోవడం బోర్డు విధి. బోర్డు ఇవాళ ఇలా ఉందంటే దానికి కారణం వాళ్లే..’అని పేర్కొన్నారు.
పెంచిన పెన్షన్ల ప్రకారం.. నెలవారీగా రూ. 15 వేలు అందుకునే మాజీ క్రికెటర్లు, సిబ్బంది ఇప్పుడు రూ. 30 వేలు అందుకుంటారు. రూ. 22,500 తీసుకునేవాళ్లు రూ. 45 వేలు… రూ. 30వేల పెన్షన్ తీసుకునే వారికి రూ. 52,500 లభించనుంది. రూ. 37,500 వచ్చేవాళ్లకు రూ. 60 వేలు.. రూ. 50వేల పెన్షన్ లభించేవారికి రూ. 70వేల దాకా అందనుంది.
I’m pleased to announce an increase in the monthly pension of former cricketers (men & women) and match officials. Around 900 personnel will avail of this benefit and close to 75% of personnel will be beneficiaries of a 100% raise.
— Jay Shah (@JayShah) June 13, 2022