డబ్ల్యూటీసీ టోర్నీకి భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ : ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ భారత జట్టు ఖరారైంది. ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 తేదీ వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగా అజింక్యా రహానేను తిరిగి జట్టుకు ఎంపిక చేసింది. దేశవాళీ టోర్నీతో పాటు ఐపీఎల్లో చెన్నై తరఫున రహానే అదరగొడుతున్నాడు.
తన శైలికి భిన్నంగా ధనాధన్ ఆటతీరుతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరం కావడం రహానేకు కలిసొచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్కిషన్ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. కేఎస్ భరత్ ఏకైక వికెట్కీపర్ బ్యాటర్గా కొనసాగనున్నాడు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ ఆల్రౌండర్లుగా వ్యవహరించనున్నారు.
భారత జట్టు: రోహిత్శర్మ(కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లీ, రహానే, రాహుల్, భరత్, అశ్విన్, జడేజా, అక్షర్పటేల్, శార్దుల్, షమీ, సిరాజ్, ఉమేశ్, ఉనాద్కట్