ముంబై: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను (Women’s World Cup) సాధించిన సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయం లిఖించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ జట్టు బీసీసీ (BCCI) భారీ నజరానా ప్రకటించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన టీమ్ఇండియాకు రూ.51 కోట్లు (Cash Reward) ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను స్వదేశంలో భారత జట్టు (Team India) సగర్వంగా ముద్దాడింది. ఆదివారం సుమారు 40వేల మంది అభిమానుల సమక్షంలో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ.. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి కొత్త చరిత్ర సృష్టించింది. భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో సౌతాఫ్రికా.. 45.3 ఓవర్లలో 246 పరుగుల వద్దే ఆగిపోయి తొలి కప్పు కలకు దూరమైంది. ఛేదనలో సారథి లారా వోల్వార్డ్ (98 బంతుల్లో 101, 11 ఫోర్లు, 1 సిక్స్) బ్యాక్ టు బ్యాక్ శతకంతో కదం తొక్కినా మిగిలిన బ్యాటర్లు విఫలమవడం ఆ జట్టును దెబ్బతీసింది. బ్యాట్తో మెరిసిన దీప్తి.. బంతితోనూ (5/39) కీలక వికెట్లు తీసి సఫారీల నడ్డి విరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. షెఫాలీ వర్మ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్స్లు) సాధికారిక ఇన్నింగ్స్కు తోడు దీప్తి (58 బంతుల్లో 58, 3 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (58 బంతుల్లో 45, 8 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షెఫాలీకి దక్కగా టోర్నీలో 215 రన్స్, 22 వికెట్లతో సత్తాచాటిన దీప్తి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా ఎంపికైంది.
విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు 44 లక్షల 80 వేల డాలర్లు (రూ.39కోట్ల 80లక్షలు), రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22లక్షల 40వేల డాలర్లు (రూ.19కోట్ల 90లక్షలు) లభించాయి. సెమీఫైనల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు 11 లక్షల 20 వేల డాలర్ల (రూ.9కోట్ల 94లక్షలు) చొప్పున లభించాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ.6కోట్ల 21లక్షలు) చొప్పున… ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ.2కోట్ల 48లక్షలు) చొప్పున లభించాయి. అదేవిధంగా ప్రపంచకప్లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2లక్షల 50వేల డాలర్ల (రూ.2 కోట్ల 22లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34వేల 314డాలర్ల (రూ.30లక్షల 47వేలు) చొప్పున లభించాయి.