ముంబై: ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డుగా పేరున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశవాళీ క్రికెటర్లకు శుభవార్త చెప్పింది. వచ్చే సీజన్లో రంజీ, ఇతర దేశవాళీ క్రికెట్ ఆడే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచింది. సోమవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాజా పెంపు ప్రకారం.. నలభై కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన సీనియర్ క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్కు రూ. 60 వేలు (దాదాపు గతం కంటే రెట్టింపు), 21-40 మ్యాచ్లు ఆడినవారికి రూ. 50 వేలు అందజేయనుండగా అంతకంటే తక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్లకు రూ. 40 వేలు ఇవ్వనున్నారు. తాజా నిర్ణయం ద్వారా సుమారు 2వేల మంది దేశవాళీ క్రికెటర్లకు లాభం చేకూరనున్నది.
ఇక అండర్-23 క్రికెటర్లకు రూ. 25వేలు, అండర్-19 ఆటగాళ్లకు రూ.20 వేలు అందనున్నాయి. మరోవైపు కరోనా వైరస్స కారణంగా నష్టపోయిన దేశవాళీ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50 శాతం అదనంగా అందివ్వనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. 2019-20 దేశవాళీ సీజన్లో పాల్గొన్న క్రికెటర్లకు 2020-21 సీజన్కు గాను పరిహారం అందనున్నది.